సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. మంగళవారం 704బృందాలతో 51,884 ఇండ్లలో సర్వే జరిపారు. గత సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సర్వేలో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు ఇప్పటి వరకు 3,37,253 ఇండ్లలో సర్వే నిర్వహించారు. ఈ బృందాలు జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు జ్వర కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావణంను పిచికారీ చేస్తున్నారు. కాగా ప్రతి బస్తీ దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దవాఖానల్లో ఓపీ సేవలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అన్ని దవాఖానల్లో మంగళవారం 18,586 మందికి జ్వర పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 1,43,498 మందికి జ్వర పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.