కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా చేపడుతున్న ఇంటింటి సర్వే చురుగ్గా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఇంటి యాజమాని పేరు, ఫోన్ నంబరుతో పాటు ఇంట్లో ఎంత మంది ఉన్నారనే సమాచారం కూడా తీసుకుంటున్నారు. ఇందులో పెద్దలు ఎందరు? పిల్లలు ఎంత మంది? వారిలో ఎవరికైనా నాలుగైదు రోజులుగా జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, విరేచనాలు, గొంతునొప్పి, ఇలా ఏ లక్షణమైనా ఉందా? అని అడుగుతున్నారు. ఉందని చెబితే ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకుంటున్నారు. కొవిడ్ లక్షణాతో బాధపడుతున్న వారికి ఉచితంగా కరోనా మందుల కిట్ను అందజేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే ఐదు రోజుల పాటు మందుల వాడకంతో కరోనా రాకుండా జాగ్రత్తలు చేపట్టడంలో విజయం సాధిస్తున్నారు.
కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడవ రోజు 704 బృందాలు… 41,192 ఇండ్లలో ఫీవర్ సర్వే చేపట్టాయి. ఇప్పటి వరకు మొత్తం 2,71,878 ఇండ్లల్లోని ప్రజలకు పరీక్షలు జరిపినట్లు అధికారులు తెలిపారు. జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ద్రావకాన్ని పిచికారీ చేస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.