సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసులపై సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తున్న ఇద్దరు యువకులపై సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో షేర్ చేస్తూ, అవి తెలంగాణ పోలీసులు చేసినట్లు, అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు ట్విట్టర్లో డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు కూడా వాటిని ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై ఆరా తీయడంతో తెలంగాణకు సంబంధించింది కాదని, మహారాష్ట్రలో జరిగిన ఘటన అని పోలీసులు తేల్చారు. దీనిపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు 67 ఐటీ యాక్టు, 505(1బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన భరద్వాజ్ సోమరాజు, జీవన్ అనే ఇద్దరు వ్యక్తులు దీనికి కారకులని పోలీసులు గుర్తించారు. సోషల్మీడియాలో వచ్చిన వీడియోలు ఎక్కడ, ఎప్పుడు జరిగింది అని పరిశీలించకుండా పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని సీసీఎస్ సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ హెచ్చరించారు.