సిటీబ్యూరో, మార్చి 4(నమస్తే తెలంగాణ): మోసపోయి… ఆ మోసపోయిన డబ్బును తిరిగి పొందడానికి స్నేహితుడితో కలిసి తక్కువ ధరకు బంగారం అంటూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తితోపాటు మరో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 8 లక్షల నగదు, 5.85 కిలోల నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. మిరాలం మండీ ప్రాంతానికి చెందిన మిర్జా అబ్బాస్ అలీ సజ్జాద్ రియల్ ఎస్టేట్ వ్యా పారి. ఇతడి స్నేహితుడు అలీ అక్బర్ తయ్యాబి హోటల్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ ఇద్దరు ఈ నెల 1న తమ వద్ద ఆరు కిలోల బంగారం ఉందని, తులం 40 వేల చొ ప్పున విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముబిన్ అనే వ్యక్తికి చెప్పారు. దీనికి అతడు ముందుకురావడంతో ముందుగా 20 తులాల బంగారం బిస్కెట్ ఇస్తున్నామని… పరీక్షించుకోమంటూ సూచించారు. అం దుకు రూ. 50 వేలు ఇవ్వాలని చెప్పగా… ఆ డబ్బులు ఇచ్చి… పరీక్ష కోసం బిస్కెట్ను తీసుకెళ్లాడు. పరీక్షలో అది నకిలీదని తేలడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఈ నకిలీ డొంక కదిలింది. అయితే ఘటనలో నిందితుడిగా ఉన్న మిర్జా అబ్బాస్.. ఓ ఆర్ఎంపీ చేతిలో ఇలాగే మోసపోయి, మోసపోయిన డబ్బును రాబట్టుకునేందుకు.. ఈ నకిలీ అవతారమెత్తాడని తేలింది.
ఓల్డ్మల్లేపల్లికి చెందిన సయ్యద్ దస్తగిరి అహ్మద్ ఆర్ఎంపీ డాక్టర్. తనకు తాంత్రిక విద్యలున్నాయని, ఇండ్లు, ఇతరాత్ర ప్రాంతాల్లో దాచి పెట్టిన బంగారాన్ని వెలికి తీస్తానంటూ అమాయకులను నమ్మించి మోసాలు చేస్తున్నాడు. ఇతడికి యాఖత్పురాకు చెందిన అబ్దుల్ ఫహీమ్, చార్మినార్కు చెందిన షేక్ హఫీజ్లు సభ్యులు.. క్లినిక్కు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఇద్దరు.. డాక్టర్ తాంత్రిక విద్యల గురించి ప్రచారం చేస్తుంటారు. ఇదిలా ఉండగా… మిర్జా అబ్బాస్ అలీ తల్లికి కొన్ని చెడు కలలు వస్తున్నాయని… దాచి ఉంచిన సంపదను వెలికి తీయకపోతే అది తన మరణానికి కారణమవుతుందనే ఆమె కలలో భయపడుతుందని స్నేహితుడు అక్బర్ తయ్యాబికి చెప్పాడు. అతడు అబ్దుల్ ఫహీమ్, షేక్ హఫీజ్కు చెప్పగా… అబ్బాస్ అలీని ఆర్ఎంపీ సయ్యద్ దస్తగిరికి కల్పించగా.. తన తల్లికి వస్తున్న కలల గురించి చెప్పాడు.. ఆ కలలు నిజమే, మీ ఇంట్లో దాచిపెట్టిన బంగారం ఉంది, దానిని బయటకు తీయాలంటే ప్రత్యేక పూజలు చేయాలి… ఈ పూజలకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందంటూ చెప్పగా.. అడ్వాన్స్గా రూ. 3 లక్షలు అబ్బాస్ చెల్లించాడు.
ఆర్ఎంపీ దస్తగిరి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని తవ్వడానికి అనుచరులు ఫహిమ్, హఫీజ్ను పిలిపించాడు. ఒక పక్క పూజ చేస్తున్నట్లు నటిస్తూ.. ఇంట్లో ఐదు ప్రాంతాల్లో తన అనుచరులతో తవ్వించాడు. అబ్బాస్ కుటుంబ సభ్యుల దృష్టి మళ్లించి, ఒక బట్టలో ఉంచిన ఇత్తడి కడ్డీలను బయటకు తీసి బంగారం బయటపడిందని, వాటికి కొన్ని శక్తులుంటాయని, ఇప్పుడు వాటిని తెరవద్దంటూ సూచించాడు. కొద్దిసేపటికి అబ్బాస్ వాటిని తెరిచి చూడగా అందులో ఇత్తడి కడ్డీలున్నాయి. దీనిపై పూజలు చేసిన దస్తగిరిని నిలదీయగా.. నేను చెప్పినట్లు మీరు చేయలేదు, త్వరగా తెరిచారు.. అందుకే బంగారం.. ఇత్తడిగా మారిందంటూ దబాయించాడు. దీంతో మోసపోయానని గుర్తించి.. మోసపోయిన డబ్బులు తిరిగి పొందాలనుకున్న అబ్బాస్ అలీ.. తాను కూడా ఇలాగే ఇతరులను మోసం చేయాలని భావించి.. తయ్యాబితో కలిసి నకిలీ బంగారాన్ని విక్రయించడం మొదలు పెట్టాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయడంతో అబ్బాస్ మోసాలతో పాటు దస్తగిరి గ్యాంగ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. దస్తగిరి 15 ఏండ్లుగా మోసాలు చేస్తున్నా.. బాధితు లు ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సీపీ తెలిపారు. విశ్వసనీయ సమచారంతో శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు ఈ ముఠాలోని దస్తగిరి, హఫీజ్, అక్బర్ తయ్యాబీ, అబ్బాస్లను అరెస్ట్ చేసి, మరో నిందితుడు అబ్దుల్ ఫహీమ్ కోసం గాలిస్తున్నారు.