హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద విజిటింగ్కార్డులు సేకరించి ఫోన్లు
అసలైన బంగారమంటూ మోసం
కర్ణాటక, ఏపీకి చెందిన గ్యాంగ్ అరెస్ట్
రూ. 15 లక్షలు స్వాధీనం
“పొలంలో తవ్వకాలు జరుపుతుండగా లంకె బిందెలు దొరికాయి.. మాకు అత్యవసరంగా డబ్బు అవసరముంది.. మీకు తక్కువ ధరకే బంగారు ఆభరణాలు అమ్ముతాం” అంటూ నమ్మించి నగర వ్యాపారిని మోసం చేసిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు.
చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ పటేల్నగర్కు చెందిన కె.విజయ్కుమార్ అనే వ్యాపారి కేఎల్ఎం లాజిస్టిక్స్ అండ్ బస్ టికెట్ బుకింగ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత నెలలో సదరు వ్యాపారి విమాన టిక్కెట్ క్యాన్సిల్ కోసం వెళ్లిన సమయంలో ఓ ముఠా కలిసి.. విజిటింగ్ కార్డు తీసుకున్నారు. కొన్ని రోజుల తరువాత (మార్చి 9న) ఆ వ్యాపారికి ఫోన్ చేశారు. “మాది మైసూర్.. పొలం దున్నుతుండగా లంకెబిందెలు(బంగారు ఆభరణాలు) లభించాయి.. మాకు ఎవరూ తెలియదు.. మీ కార్డు ఉండటంతో మీకు ఫోన్ చేశాం.. మాకు డబ్బు అత్యవసర ముంది.. మీకు తక్కువ ధరకే ఆభరణాలను ఇస్తాం” అని నమ్మించారు. నాలుగు రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చి బండ్లగూడ కట్టమైసమ్మ ఆలయ సమీపంలో సదరు వ్యాపారిని కలిశారు. తమ వద్ద కిలో బంగారం ఉందని, ఈ ఆభరణాల షాంపిల్స్ను పరీక్షించుకోవాలంటూ నాలుగు కడ్డీలను అతడికి ఇచ్చారు. వ్యాపారి పరీక్షలు చేయించగా అసలైన బంగారమని తేలింది. దీంతో వాళ్ల వద్ద ఉన్న కిలో బంగారాన్ని, రూ. 17 లక్షలు ఇచ్చి తీసుకున్నాడు. పది రోజుల తరువాత వాటిని కరిగించగా.. అవి నకిలీవని తేలింది. దీంతో బాధితుడు చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు దర్యాప్తు చేపట్టారు.