చార్మినార్, జూలై 13 : బ్యాంకు వేలం పాటలో కొనుగోలు చేసిన భవంతికి సంబంధించిన నకిలీ దస్తావేజులు సృష్టించి, రిజిస్ట్రేషన్ చేసిన ఘటన పాత నగరంలో చోటు చేసుకుంది. కోట్ల విలువైన ఆస్తిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించిన బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. వీరేశ్ మూర్తి అఫ్జల్గంజ్లోని హోటల్ పెరల్ సిటీ పై 2000లో చార్మినార్ బ్యాంకు నుంచి రూ 2.30 కోట్లు అప్పుగా తీసుకుని, వాయిదాల పద్ధతిలో రుణం డబ్బులు చెల్లించలేదు. దీంతో చార్మినార్ బ్యాంకు 2003లో విరేశంను డిఫాల్టర్గా గుర్తిస్తూ నోటీసులు జారీ చేసింది. డబ్బులు చెల్లించేందుకు మరికొన్ని నెలల గడువు కూడా ఇచ్చింది. బ్యాంకు ఇచ్చిన అవకాశాన్ని విరేశం సద్వినియోగం చేసుకోలేదు.
దీంతో చార్మినార్ బ్యాంక్.. హోటల్ పెరల్ సిటీని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుంది. వేలం ద్వారా విక్రయించి, బకాయిలను తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంకు అధికారులు బహిరంగ నోటీసులు జారీ చేశారు. మీర్చౌక్ ప్రాంతానికి చెందిన అమీరుద్దీన్ బ్యాంకు వేలం పాటలో పాల్గొని హోటల్ పెరల్ సిటీని రూ. 2.50 కోట్లకు దక్కించుకున్నాడు. ఆస్తిని అమీరుద్దీన్కు బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విరేశం నకిలీ దస్తావేజులు సృష్టించి ఆస్తిని ఇతరులకు విక్రయించాడు. ఇది గుర్తించిన అమీరుద్దీన్ కుటుంబ సభ్యులు చార్మినార్ బ్యాంకు అధికారులను సంప్రదించారు. వెంటనే రిజిస్ట్రేషన్ను నిలిపివేయాలని కోరుతూ దూద్బౌలి సబ్ రిజిస్ట్రారర్ను కోరారు. బ్యాంకు ద్వారా కొనుగోలు చేసిన హోటల్ పెరల్ సిటీని అక్రమంగా విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ పోలీసులు విచారణను ప్రారంభించారు.