సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): రియల్టర్ విజయభాస్కర్రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు గురూజీ అలియాస్ త్రిలోక్నాథ్ ఆచూకీ తెలుస్తున్నా.. చివరి క్షణంలో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. 10 రోజుల నుంచి దాగుడు మూతలు ఆడుతున్నాడు. త్రిలోక్నాథ్కు దక్షిణ భారతదేశంలో అధిక సంఖ్యలో అనుచరులు ఉండటంతో అతడికి రోజుకు ఒకరు ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. సైబరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పుణె, కేరళ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఆచూకీ దొరికిందని ఆశతో ఆ ప్రదేశానికి వెళ్లగానే.. అక్కడి నుంచి గురూజీ మాయమవుతున్నాడు. ఇలా ఒక చోటు మార్చిన తర్వాత త్రిలోక్నాథ్ ఇక ఆ ప్రాంతం నుంచి కమ్యూనికేషన్ను పూర్తిగా కట్ చేసుకుంటున్నాడని పోలీసులు గుర్తించారు. కారులోనే ప్రయాణిస్తూ.. ఆయా ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాడని సమాచారం ఉంది. నాటు వైద్యంతో చాలా మందికి రోగాలను నయం చేశాడనే భావనను కల్పించడంతో అనుచరులు కూడా అతడికి పూర్తిగా సహకరిస్తూ.. పోలీసుల దృష్టిని మళ్లిస్తున్నారని తెలిసింది. ఎన్ని దాగుడు మూతలు ఆడినా త్రిలోక్నాథ్ను అతి త్వరలోనే పట్టుకుంటామని సైబరాబాద్ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.