శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6: కాలభైరవ పూజతో ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ చేయిస్తానంటటూ ఓ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ను బురిడీ కొట్టంచిన నకిలీబాబాపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం…పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని.. 2011లో నగరానికి వచ్చి కొండాపూర్లో నివాసముంటుంది. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన గ్రాడ్యుయేట్లు మనదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) పాస్ అవ్వాలి. ఈ క్రమంలో పలుమార్లు ఎఫ్ఎంజీఈ పరీక్షలు రాసినా సదరు మహిళ పాస్ కాలేదు.
ఈ క్రమంలో 2020 ఫేస్బుక్లో ప్రకటనలు చూసిన ఆ మహిళ సోదరి.. ఓ స్వామిజీ పూజలు చేసి పరీక్షలు పాస్ చేయిస్తాడంటూ చెప్పింది. దీంతో ఆ ప్రకటన ఇచ్చిన పశ్చిమ బెంగాల్కు చెందిన విశ్వజిత్ ఝాను బాధిత మహిళ ఫేస్బుక్లో ఆశ్రయించింది. తన ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ చేయించాలని కోరింది. నకిలీబాబా మాయలో పడి కాలభైరవ పూజ పేరిట 2021 జూలై వరకు విడతల వారీగా దాదాపు రూ. 80,000 చెల్లించింది. ఆ తర్వాత సదరు బాబా నుంచి స్పందన లేకపోవడం, అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించిన ఆమె గచ్చిబౌలి పోలీసులకు జూలైలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని సదరు నకిలీబాబా విశ్వజిత్ను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మురం చేశారు. పశ్చిమబెంగాల్కు ప్రత్యేక బృందాన్ని పంపించి దర్యాప్తు వేగవంతం చేశారు.