కుత్బుల్లాపూర్, మే24 : ఫేస్బుక్ను హ్యాక్చేసి.. రూ.2.85 లక్షలు వసూలు చేసిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి గంగస్తాన్కు చెందిన డి.శ్రీనివాస్ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. శ్రీనివాస్రెడ్డి పేరుపై మరో ఫేక్ అకౌంట్ సృష్టించి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయంటూ.. ఫేస్బుక్ మెస్సేజర్, వాట్సాప్ ద్వారా సందేహం పంపించారు. ఇది నిజమని నమ్మిన శ్రీనివాస్ స్నేహితులు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్కు రూ.2 లక్షల 85వేలు బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్రెడ్డి తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గుండ్ల పోచంపల్లి లక్ష్మీనగర్కు చెందిన బి.దినేశ్రెడ్డికి ఈ నెల 21 ఫేస్బుక్ మెస్సేజర్ ద్వారా అత్యవసరంగా రూ.30వేలు కావాలంటూ తన స్నేహితుడి పేరున మెస్సేజ్ వచ్చింది. ఇది నిజమని నమ్మిన దినేశ్రెడ్డి వారు పంపిన అకౌంట్కు రూ.10వేలు బదిలీ చేశాడు. అనంతరం ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకుని పేట్బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.