లింగాల, జూలై 12: ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించాలని ఎంఈవో చంద్రుడు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆయా వార్డుల్లో తిరిగి విద్యార్థులు వింటున్న ఆన్లైన్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సామాజికదూరం పాటిస్తూ ఆన్లైన్ తరగతులు వినాలన్నారు. అత్యవర సమయంలో బయటకు వెళ్తే మాస్కులు ధరించాలన్నారు. అదేవిధంగా మండలంలోని మానాజీపేట, జీలుగుపల్లి, జీలుగుపల్లితండా పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు అజాజ్, నరేశ్, అపర్ణ, పర్వతాలు, ప్రసాద్, ఉపాధ్యాయురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను హెచ్ఎం అశోక్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతోపాటు దుస్తులు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో ప్రతిరోజూ ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను వినాలన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో పాఠ్యాంశాలపై ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్రెడ్డి తదితరులు ఉన్నారు.
పాఠశాలలకు పుస్తకాలు
మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం వద్ద పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రధానోపాధ్యాయులకు ఆయా పాఠశాలలకు కేటాయించిన పాఠ్యపుస్తకాలను సీఆర్పీలు అందజేశారు. కార్యక్రమంలో సీఆర్పీలు సాయికుమార్, నాజ్యనాయక్, విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.