చార్జింగ్ పెట్టిన సమయంలో ఘటన
ఎగిసిపడిన మంటలు..ఇంట్లో కాలిబూడిదైన సామగ్రి
తప్పిన పెను ప్రమాదం
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 2: చార్జింగ్ పెట్టిన సమయంలో విద్యుత్ బండి బ్యాటరీ పేలిపోయింది. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుడి కథనం ప్రకారం.. చింతల్ డివిజన్ భగత్సింగ్నగర్కు చెందిన సాయికుమార్రెడ్డి సేల్స్ మార్కెటింగ్ చేస్తున్నాడు. తన విద్యుత్ స్కూటీ బ్యాటరీకి రోజు మాదిరిగానే రాత్రి సమయంలో చార్జింగ్ పెట్టి.. నిద్రించాడు.
బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పక్కరూములో పడుకొని ఉన్న సాయికుమార్రెడ్డికి వైర్లు కాలిన వాసన రావడంతో బయటకు వచ్చి చూడగా, బ్యాటరీ నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించాడు. స్విచ్ఛాఫ్ చేసేలోపే బ్యాటరీ పేలిపోవడంతో ఇంట్లోని సామగ్రి, దుస్తులు, వస్తువులు కాలిపోయాయి. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వచ్చి.. నీళ్లు చల్లి.. మంటలను ఆర్పివేశారు. బ్యాటరీ పెట్టిన రూంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.