సూర్యాపేట : తనకు పునర్జన్మ నిచ్చింది సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరోనా అంటేనే బయపడి పారిపోతున్న రోజుల్లో ఇక్కడి వైద్యులు, సిబ్బంది ప్రతి రోగికి సపరిచర్యలు చేస్తూనే అద్భుతమైన చికిత్సను అందిస్తున్నారని ఆయన కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వసతులు, చికిత్స కూడా కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నే రీతిలో ఉన్నాయని చెప్పారు.
కరోనాతో ఆసుపత్రిలో చేరిన తాను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం వైద్యులు, సిబ్బంది కృషే అని ఆయన తెలిపారు. రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదు కానీ ఆస్పత్రి ఇంతటి స్థాయికి చేరిందంటే అందుకు కారణం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాత్రమేనన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆస్పత్రిపై పెడుతున్న దృష్టి ఇప్పుడు కరోనా పేషంట్లకు వరంగా మారిందన్నారు.