సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యం, ఆహార నియమాలపై నిర్లక్ష్యం వహించారో అనారోగ్యానికి గురి కావడం ఖాయం. మరీముఖ్యంగా కరోనా పరిస్థితులతో చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తూ ఊబకాయం బారిన పడుతున్నారు. అదుపు లేని తిండే ఇందుకు కారణమని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. పలు అధ్యయనాలు సైతం ఇదే అంశాన్ని సైతం సూచిస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే ఓవర్ వెయిట్తో పాటు ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. వాటికి పరిష్కారంగా ప్రతిరోజు ప్రతిఒక్కరూ వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే ఆరోగ్యంగా ఉండవచ్చని వివరిస్తున్నారు.
ముఖ్యంగా నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిందే. బిజీ షెడ్యూల్, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా ఎల్లప్పుడు టెన్షన్ పడే వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గతంలో స్టేట్ ఫుడ్ సెక్యురిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ పేరిట ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని అందులో పేర్కొంది. హెల్దీఫైమీ యాప్ దేశంలోని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్లో సర్వే చేసింది. సుమారు 20కి పైగా కంపెనీల్లో పని చేస్తున్న 60 వేల మంది ఉద్యోగుల జీవనశైలిపై అధ్యయనం చేసి.. సుమారు 63 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఊబకాయంతో ఇబ్బంది పడే వారిలో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన వారిలో ఎక్కువగా అధిక బరువు ఉన్నవారేనని వారు అంటున్నారు.
సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి 8 వరకు వ్యాయామం చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కానీ నగరంలో మారుతున్న జీవన శైలి మూలంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు జిమ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారు తమకు వీలునప్పుడు జిమ్కు వస్తున్నారు. గతంలో కండలు పెంచుకోవడానికి జిమ్కు వచ్చే వారు ప్రస్తుతం ఫిట్నెస్ కోసం వస్తున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు. – రవి ప్రకాశ్, ఫిట్నెస్-9 జిమ్ నిర్వాహకుడు
జిమ్ చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా జిమ్ సెంటర్లకు వస్తున్నారు. యువత మజిల్, సైజ్ గెయినింగ్పై ఆసక్తి చూపుతుండగా.. వృద్ధులు మోకాళ్ల నొప్పులు, బీపీ తగ్గించుకునేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం సరిగా శిక్షణ ఇవ్వలేని వారు జిమ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. గుడ్డిగా నమ్మి అందులో చేరితే అవస్థలు తప్పవు.- రౌనాక్ సిద్ధిక్, రౌనాక్ ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకుడు