ఖైరతాబాద్, సెప్టెంబర్ 16 : రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా సైనికుల సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లేవని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని ది యునైటెడ్ తెలంగాణ ఎక్స్ సర్వీస్మెన్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు జీడీ వసంత్ కుమార్ అన్నారు. జీఓ ఎంఎస్ 1241 ప్రకారం ప్రభుత్వం ప్రతి మాజీ సైనికుడికి, మరణించిన సైనికుడి భార్యకు 175గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించగా, సొసైటీకి వచ్చిన వంద దరఖాస్తులను సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నర్ రమేశ్ కుమార్కు అందజేశారు. సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం పెట్టపీట వేస్తున్నదని, దేశాన్ని రక్షించే వారిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేకమైన గౌరవం ఉందన్నారు. 2017లో అసెంబ్లీలో మెదక్ జిల్లాలోని కొల్లూరు (రామచంద్రాపురం)లో నిర్మించే డబుల్ బెడ్రూం ఇండ్లలో మాజీ సైనికులు, వితంతువులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం నిర్మితమైన వాటిలో తమకు ఆ శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ సైతం సైనికుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని, త్వరలోనే ఆయనను కలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు రిటైర్డ్ లెఫ్టినెంట్ ఎండీ ఆలం అన్సారీ, కార్యదర్శి కందాల ప్రకాశ్, కోశాధికారి అజయ్ మున్నా, చీఫ్ కోఆర్డినేటర్ పాల సుందరం, షేక్ గౌస్, పి.ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.