ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక చట్టం తేవాలి
29న ఓసీ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రతినిధుల సమావేశం
ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
రవీంద్రభారతి, ఆగస్టు 21: అన్ని వర్గాలు, అగ్ర వర్గాలలోని పేదలైన వారందరికి సమ న్యాయం జరగాలని, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని, అందుకు ప్రత్యేక చట్టం తేవాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. బషీర్బాగ్లోని ఓసీ జేఏసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు.
ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేయకపోవడంతో ఏడు దశాబ్దాలుగా ప్రతిభ ఉన్న ఓసీల్లోని పేదలకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందక తీవ్ర నష్టం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఓసీల్లోని పేదలకు విద్యా, ఉద్యోగాల్లో రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరి 9న కల్పించిన 10 శాతం ఈడబ్ల్యుఎస్ కోటా రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలకు చర్యలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సమాజంలో పేదలైన అన్ని వర్గాల వారికి ఈ విధానాల వల్ల న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా పేదలందరికి సమన్యాయం చేకూరేలా ప్రత్యేక చట్టం రూపొందించాలని పోలాడి డిమాండ్ చేశారు.
అన్ని రాష్ర్టాల ఓసీ ప్రతినిధులతో ఈ నెల 29న ఢిల్లీలో కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల పదోన్నతులలో ప్రసుత విధానాలను రద్దుచేసి ప్రతిభ, సీనియార్టీ ఆధారంగా ప్రమోషన్లను కల్పించాలన్నారు. విద్య, వైద్య, ఇంజనీరింగ్, వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలలో రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రతిభను ఆధారంగా తీసుకోవాలన్నారు. రైతులకు 50 ఏళ్లు దాటితే నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పలవురు ఓసీ జేఏసీ నాయకులు బుస్సా శ్రీనివాస్, గంగవరపు రామకృష్ణ ప్రసాద్, పెండాల్య కేశవరెడ్డి, గోపు జయపాల్రెడ్డి, చెన్నమనేని పురుషోత్తంరావు, వల్లూరి పవన్కుమార్ పాల్గొన్నారు.