సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలి
సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్
భూపాలపల్లి, మే 2: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొవిడ్ పడకల సంఖ్యను మరింత పెంచాలని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మంతా శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖానలో కరోనా కట్టడిపై స్థానిక అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడిపై ఏరియా స్థాయిలో తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తల గురించి అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎంవో మాట్లాడుతూ దవాఖానలో కొవిడ్ వార్డుల సంఖ్య పెంచాలన్నారు. సరిపడా మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతిరోజూ నివేదిక పై అధికారులకు పంపాలన్నారు.
వైద్యులు, సిబ్బందికి ఏమైనా అవసరముంటే యాజమాన్యం సమకూర్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. సింగరేణిలో నూరుశాతం కరోనా వాక్సినేషన్ జరిగేలా అన్ని ఏరియాల అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. సమావేశంలో భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం సీహెచ్ నిరీక్షన్రాజ్, ఎస్వోటూ జీఎం విజయ్ప్రసాద్, డీవైసీఎంవో పద్మజ, ఏజీఎం(ఈఅండ్ఎం) రామలింగం, డీజీఎంలు సత్యనారాయణ, రమేశ్బాబు, వైద్యులు సురేశ్, గోపికృష్ణ, మాట్రిన్ శేషరత్నం, మెడికల్ ఆఫీసర్ లోక్నాథ్రెడ్డి, సీనియర్ పీవో రాజేశం, సెక్యూరిటీ ఆఫీసర్ షరిఫ్ పాల్గొన్నారు.
కార్మిక సమస్యలు పరిష్కరించాలని వినతి
భూపాలపల్లికి వచ్చిన సింగరేణి సీఎంవో శ్రీనివాస్కు టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి కలిసి తొలుత పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖానలో సిటీ స్కాన్ సౌకర్యం లేక ఇక్కడి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలైన గోదావరిఖని, కొత్తగూడెం వెళ్లాల్సి వస్తోందన్నారు. భూపాలపల్లిలో సత్వరమే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కరోనాతో మరణించిన వారికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.