ఏజెన్సీలో విస్తారంగా సాగు
ఏటా పెరుగుతున్న విస్తీర్ణం
మెలకువలు పాటిస్తే లాభసాటి
ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఆదాయం
కరకగూడెం/దుమ్ముగూడెం, ఏప్రిల్ 14: రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలంటే ఆధునిక వ్యవసాయం చేయాలి. సరికొత్త సాగు విధానాలను పాటించాలి. పంట మార్పుతో భూమి సారవంతమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన అంశం. కొత్తగా సాగు చేసే పంట ఆర్థికంగా లాభసాటిగా ఉంటే రైతులు దానిపై ఆసక్తి చూపుతారు. తాజాగా భద్రాద్రి జిల్లాలో ఆడ-మగ వరి సాగుపై మక్కువ చూపుతున్నారు. నీటి వసతి పుష్కలంగా ఉన్న చోట రైతులు ఈ పంట పండించి అధిక లాభాలు గడిస్తున్నారు. సాధారణ వరి కంటే ఎక్కువ లాభం పొందుతున్నారు. దుమ్ముగూడెం, కరకగూడెం మండలాల్లో సాగవుతున్న ఈ పంటపై ప్రత్యేక కథనం.
ఏజెన్సీ మండలాల్లో విస్తారంగా ఆడ,మగ వరిసాగు అవుతోంది. ఈ వరి సాగుతో మంచి లాభాలు ఉండడంతో రైతులు సాగుపై మక్కువ చూపుతున్నారు.
కరకగూడెం మండలంలోని అనంతారం, సమత్భట్టుపల్లి, సమత్మోతే, కరకగూడెం, భట్టుపల్లి గ్రామాల్లో సుమారుగా 2 వేల ఎకరాలు, దుమ్ముగూడెం మండలంలోని గంగోలు, ఆర్లగూడెం తదితర గ్రామాల్లో 3 వేల ఎకరాల్లో హైబ్రీడ్ (ఆడ- మగ) వరి సాగు జరుగుతున్న ది. రైతులు కావేరి, బేయర్, సింజింటా, యూఎస్, రాశితో పాటు మరికొన్ని మేలైన విత్తనాలను ఎంచుకుంటున్నారు. ఎక్కువగా కావేరి, బేయర్ కంపెనీల విత్తనాలను ఈ ప్రాంతం వారు వినియోగిస్తున్నారు.
పైరును కలపడమే కీలకం
ఆడ- మగ వరి నాటు సాధారణ వరి సాగు కంటే భిన్నంగా ఉంటుంది. మగ నారు, ఆడ నారు వేరువరుగా చల్లుకోవాలి. మగ నారు సాలు మధ్య ఆరు నుంచి ఎనిమిది సాలు దూరంలో ఆడ నారు వేసుకోవాలి. ఈ సాగులో పొట్ట దశ నుంచి పంటను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమైన పని. పొట్ట దశలో పంటకు నీటి ఎద్దడి లేకుండా చేసుకోవాలి. ఈ దశలోనే ఆడ, మగ మొక్కలను క్రాసింగ్ (కలపడం) చేయాల్సి ఉంటుంది. నిపుణులైన విత్తన కంపెనీల ప్రతినిధుల సలహాలు, సూచనల మేరకు ఈ పని చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు వరిని కలుపుతారు. రోజుకు నాలుగు సార్లు చొప్పున 15 రోజల పాటు క్రమం తప్పకుండా ఈ ప్రక్రియ చేపడతారు. ఉబ్బరం పుట్టే ఎండకు వరిని కలిపితే క్రాసింగ్ బాగా జరిగి అధిక దిగుబడి వస్తాయని రైతులు చెబుతున్నారు. పంటకోతకు వచ్చినప్పడు మొదటగా మగ వరిని కోయించాలని, ఆ తర్వాత కంపెనీ ప్రతినిధుల సూచనలతో ఆడ వరిని యంత్రాల సాయంతో కోయించాలంటున్నారు.
భారీగా దిగుబడి
హైబ్రీడ్ వరి సాగులో అన్ని రకాల జాగ్రత్తలతో సమయానుకూలంగా సాగు చేస్తే ఎకరానికి 10 నుంచి 13 క్వింటాళ్ల దాకా దిగుబడి ని సాధించవచ్చు. ఆడ రకం వరి ధాన్యాన్ని ఆయా కంపెనీల ప్రతినిధులే కొనుగోలు చేస్తారు. ఒక క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.9 వేల దాకా ధర చెల్లిస్తారు. డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తారు. ఇక మగ వరి నుంచి వచ్చిన దిగుబడిని రైతులే విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఎకరాకు పెట్టుబడికి రూ.40 వేలు కాగా లాభం రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుందని రైతులు వెల్లడిస్తున్నారు.
ఏటా సాగు చేస్తున్నా..
ఏటా నేను హైబ్రీడ్ 5, 6 ఎకరాల్లో ఆడ- మగ వరి సాగు చేస్తున్నా. ఈ యాసంగిలో ఆరు ఎకరాల్లో సాగు చేపడుతున్నా. పంట బాగుంది. విత్తన కంపెనీ ప్రతినిధుల పలు సూచనలు, సలహాలు ఇస్తన్నారు. వరి కలపడం పూర్తయింది. మంచి దిగుబడులు వస్తున్నాయి. మంచి ధర ఉండడంతో సాగుపై ఆసక్తి పెరుగుతుంది. మా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ వస్తుండని కాంగ్రెసోళ్లకు వణుకు