సుల్తాన్బజార్, మే 26 : కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానకు బుధవారం బ్లాక్ ఫంగస్ రోగులు 253 మంది రాగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి 8 మందికి అడ్మిషన్ ఇచ్చారు. అవసరమున్న 22 మందికి శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు ఇకమీదట వార్డుల్లోనే అన్ని రక్త పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోగుల రద్దీకనుగుణంగా నేటి నుంచి మరో 50 పడకలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దవాఖానలో పడకలు పూర్తిగా నిండిపోయాయని, అయినా సాధ్యమైనంత వరకు వైద్యమందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం నిత్యం ఓపీకి 350 మంది రోగులు వస్తుండగా, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించి అనంతరం సరోజినీదేవి దవాఖానకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు తెలిపారు. రోగులు రక్తపరీక్షల కోసం బయటకెళ్లకుండా అన్ని పరీక్షల శాంపిళ్లను నారాయణగూడ ఐపీఎం ఆవరణలోని తెలంగాణ డయోగ్నోస్టిక్ ల్యాబ్కు పంపిస్తున్నామని చెప్పారు.
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీతో ఏర్పాట్లు
జూబ్లీహిల్స్, మే 26: ఎర్రగడ్డ ఛాతి దవాఖాన అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్న ఈ దవాఖానను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. దశాబ్దాల నాటి ఈ దవాఖాన ఆధునీకరణపై అధికారులు దృష్టి సారించారు. ఈ దవాఖానలో 124 బెడ్లతో కొవిడ్ సేవలను ప్రారంభించగా.. మరో 103 బెడ్లను విస్తరించారు. దీంతో పాటు దవాఖాన సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో మరో 66 బెడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దవాఖానలో ప్రస్తుతమున్న 227 ఆక్సిజన్ బెడ్లలో 26 బెడ్లకు వెంటిలేటర్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇటీవల పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్ దవాఖాన అభివృద్ధిపై ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జోనల్ కమిషనర్ రవికిరణ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.