బంజారాహిల్స్, సెప్టెంబర్ 26: మూత్రాన్ని ఆపుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా నయం చేసేందుకు ప్రముఖ మహిళా వైద్య నిపుణురాలు డా.మంజుల అనగాని ఆధ్వర్యంలో ‘ఎమ్సెల్లా’ పేరుతో ఓ పరికరాన్ని ఆవిష్కరించారు. బంజారాహిల్స్ రోడ్ నం. 2లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకురాలు నందినీరెడ్డి ఎమ్సెల్లా పరికరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.మంజుల అనగాని మాట్లాడుతూ.. చాలామందిలో మూత్రం ఆపుకోలేకపోవడం అనేది ఇటీవల పెద్ద సమస్యగా మారిందన్నారు. ప్రధానంగా మహిళల్లో ఈ పరిస్థితి తీవ్ర ఇబ్బంది కరంగా ఉంటుందన్నారు.
పెల్విక్ కింది భాగంలోని కండరాలు బలహీనంగా మారడంతో పాటు సరైన వ్యాయామం లేకపోవడంతో ఈ సమస్య ఎక్కువవుతుంటుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్సెల్లా చైర్ సాయపడుతుందన్నారు. ఎమ్సెల్లా చైర్లో 28 నిమిషాల పాటు కూర్చుని ఉండాలని, చైర్ కింది భాగంలోని ఏర్పాటు చేసిన విధానంతో కండరాలకు బలం చేకూరుతుందని, దీంతో ఇబ్బంది దూరమవుతుందన్నారు. వారానికి రెండుసార్లు చొప్పున మూడు వారాల పాటు ఈ చికిత్సను అందిస్తే సమస్య చాలా వరకు తగ్గిపోతుందని వివరించారు. బీటీఎల్ ఇండియా పునీత త్రివేది తదితరులు పాల్గొన్నారు.