రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత, కరెంటు వినియోగం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం వీడియో కాన్పరెన్స్లో జోనల్, సర్కిల్ అధికారులు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) జె.శ్రీనివాస్రెడ్డి, సీజీఎం, ఎస్ఈలతో చర్చించారు. ఎండాకాలంలో అదనపు లోడ్ను తట్టుకునేలా 56 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 1725 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 11 కొత్త సబ్స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, 33 ఫీడర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, సరఫరాలో అంతరాయం లేకుండా, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు 2శాతం ట్రాన్స్ఫార్మర్ల రోలింగ్ స్టాక్, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, మంటలు ఆర్పే పరికరం వంటి వాటిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. వేసవి ముగిసే వరకు ఎస్ఈల నుంచి ఏఈల వరకు సబ్స్టేషన్లలో రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటి డిమాండ్తో పోల్చితే ప్రస్తుతం విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిందని, ఇందుకనుగుణంగా ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్నిరంగాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు తమ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఏమైనా ఫిర్యాదులున్నా, అంతరాయం కలిగినా 1812 లేదా 100, సంస్థ వెబ్సైట్, సంస్థ మొబైల్ యాప్, ట్విట్టర్, ఫేస్బుక్ల ద్వారా ఫిర్యాదు చేయాలని సీఎండీ వినియోగదారులకు సూచించారు.