సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రుతు పవనాలు చకచకా కదలడంతో వర్షా కాలం రానే వచ్చింది. ఈ నేపథ్యంలో మహా నగర పరిధిలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. నిరంతర విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గ్రేటర్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, ఆపరేషన్స్ విభాగం ఉన్నతాధికారులు ఒక్కో సర్కిల్లో మూడు చొప్పున డిజాస్టర్ బృందాలను ఏర్పాటు చేశారు. వర్షా కాలం సీజన్ ప్రారంభమయ్యే జూన్ నెల మొదలుకొని వరుసగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసే వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి తోడు అదనంగా సిబ్బందిని నియమించుకొని క్షేత్ర స్థాయిలో నిరంతరం అప్రమత్తంగా ఉండనున్నారు.
ప్రధానంగా ప్రతి సర్కిల్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తినా వెంటనే అక్కడికి చేరుకునేందుకు సిద్ధంగా డిజాస్టర్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. 24 గంటల పాటు ఈ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. గృహ వినియోగదారులతో పాటు వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు, పరిశ్రమల వంటి వాటికి విద్యుత్ అంతరాయం అనేది ఎక్కువగా లేకుండా ఉండేందుకు 11 కేవీ లైన్లను ఇప్పటికే ప్రత్యేకంగా పరిశీలించామని, అవసరమైన చోట మరమ్మతులు సైతం పూర్తి చేశామని ఆపరేషన్స్ విభాగం అధికారులు తెలిపారు. తొమ్మిది సర్కిళ్ల పరిధిలోనూ ఎక్కడా అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎంత మంది సిబ్బంది అవసరమున్నా సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గ్రేటర్లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1912 టోల్ ఫ్రీ నంబర్కు చేయాలని అధికారులు సూచించారు. ఎక్కువ మొత్తంలో ఫిర్యాదు వచ్చినా వాటిని నమోదు చేసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచామని, ఒకేసారి 60 ఫిర్యాదులు ఈ నంబర్కు వచ్చినా నమోదవుతాయని
అధికారులు తెలిపారు.
నగర పౌరులు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు విద్యుత్ స్తంభాలు, ఇతర విద్యుత్ వ్యవస్థల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాకాలంలో ప్రధానంగా పలుచోట్ల ఇనుప స్తంభాల కారణంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో సెక్షన్ల వారీగా వాటిని సిబ్బంది పరిశీలించి, అక్కడ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చేయాలని ఏఈతో పాటు లైన్మెన్లకు సూచించారు. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచన మేరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నామని సర్కిల్ అధికారులు తెలిపారు. ప్రధానంగా క్షేత్ర స్థాయిలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలు తెగిపడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నచోట వాటిని తొలగించామని తెలిపారు. అయినా, ఇంకా అలాంటి ప్రాంతాలను పర్యవేక్షించాలనిక్షేత్ర స్థాయి సిబ్బందికి ఆయా సర్కిళ్ల పరిధిలోని డీఈ, ఏఈలు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటుచేసి సూచనలు చేశారు.
విద్యుత్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించేందుకు ట్రాన్స్కోకు చెందిన వెంగళరావునగర్లోని స్కాడా భవనం నుంచి ఆన్లైన్ ద్వారా పరిశీలించే ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను కంప్యూటరీకరించడంతో ఏ సర్కిల్లో, డివిజన్ లేదా సెక్షన్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడితే గుర్తించే పరిజ్ఞానం ఉంది. దీని ఆధారంగా గ్రేటర్ పరిధిలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తూ క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందికి తగిన సూచనలు ఇస్తుంటారు. డిమాండుకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉంది. విద్యుత్ను నిరంతరం సరఫరా చేయడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించామని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.