సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): వేసవి వస్తోందంటే చాలు విద్యుత్కు భలే డిమాండు ఉంటుంది. సాధారణ రోజుల్లో కంటే వేసవిలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ వినియోగం జరుగుతుంది. పగలు మండే ఎండలు, రాత్రి ఉక్కపోతతో సతమతమయ్యే నగర వాసులు విద్యుత్ వినియోగంతోనే వేసవిలో ఉపశమనం పొందే వారు. కానీ గత రెండేళ్లుగా వేసవి కాలంలో గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ వినియోగం అంచనాల తారుమారు చేస్తూ గణనీయంగా తగ్గిపోయింది. 2019 మే నెలలో విద్యుత్ వినియోగం సరాసరిన 6.5-7 కోట్ల యూనిట్లు ఉంటే గత ఏడాది 2020 నుంచి ఈ ఏడాది 2021 మే నెలలోనూ ఒక్కసారి రోజువారి విద్యుత్ డిమాండు తగ్గిపోయింది. 2020లో మే 60 మిలియన్ యూనిట్ల లోపే ఉండగా, 2021 మే నెలలో మాత్రం మరింత తగ్గిపోయి సరాసరిన 5.04 కోట్ల యూనిట్లుగా నమోదైంది. 2021 వేసవి కాలంలో అత్యల్పంగా 4.49 కోట్ల, అత్యధికంగా 5.658 కోట్ల యూనిట్లుగా నమోదైందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కరోనా వైరస్ మహమ్మారి ఒక కారణం అయితే ఈ వేసవిలో ఏప్రిల్ నెలఖారు నుంచే వరసగా అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితులతో విద్యుత్ డిమాండు తగ్గిపోయిందన్నారు.
ప్రతియేటా పెరిగే విద్యుత్ డిమాండును అంచనా వేసిన విద్యుత్ శాఖ అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది వేసవిలో 7.8 కోట్ల యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే మార్చి, ఏప్రిల్ నెలల నుంచి కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్ర మైంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మే 12 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ విధించింది. దీంతో విద్యుత్ వినియోగం కొంత తగ్గిపోయింది. అయితే గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉంటే ఐటీ కంపెనీలు ఈ సారి కూడా వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇచ్చారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు నాణ్యమైన నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తోంది. ఎంత డిమాండు ఉన్న ఆ స్థాయిలో సరఫరా చేసే వ్యవస్థను గత 6 ఏళ్లలోనే అభివృద్ధి చేశారు. విద్యుత్ డిమాండు పడిపోవడంతో ఆ ప్రభావం బిల్లులపై పడింది. కరోనా ప్రభావంతో గ్రేటర్ పరిధిలో వేసవిలో ప్రతి నెలా రూ.250 కోట్ల వరకు ఆదాయం తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం విద్యుత్ కనెక్షన్లు 52 లక్షల వరకు ఉండగా, ప్రతి నెలా బిల్లుల ద్వారా రూ.1500 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ముఖ్యంగా వేసవిలో సుమారు 15 నుంచి 18 మిలియన్ యూనిట్లు అధికంగా వినియోగం జరిగితే రూ.200 కోట్ల నుంచి 300కోట్ల దాకా ఆదాయం వచ్చేది. కానీ డిమాండు తగ్గిపోవడంతో సంస్థకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది.