సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ద ట్రేడ్ షో కంపెనీ సంయుక్తంగా అక్టోబర్ 8నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు నగరంలోని హైటెక్స్లో ఎలక్ట్రిక్ వెహికిల్ ఎక్స్పో నిర్వహించనుంది. ఈ మేరకు ద పార్క్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. ఎక్స్పోలో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీదారులు, ఇతర పరిశ్రమ వర్గాలు ఒకే వేదికపైకి రాబోతున్నాయి. సమగ్రమైన మార్కెటింగ్, వాణిజ్య సమాచారాన్ని పంచుకోవడానికి ఈ ఎక్స్పో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆటోమోటివ్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, దేశంలోనే ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ద ట్రేడ్ షో కంపెనీ పార్టనర్ మనోట్ పట్వర్ధన్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ శివుని బాబు పాల్గొన్నారు.