హైదరాబాద్ మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోరారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు, ఆక్సిజన్, రెమ్డెసివిర్ సరఫరాపై ప్రధానితో సీఎం గురువారం టెలిఫోన్లో మాట్లాడారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూరు నుంచి, కర్ణాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. మెడికల్ హబ్గా హైదరాబాద్ మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా వైద్య సేవలకోసం హైదరాబాద్పైనే ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైదరాబాద్కు కొవిడ్ చికిత్సకోసం రోగులు వస్తుండటంతో నగరంపై భారం పెరిగిపోయిందని వివరించారు. తెలంగాణ జనాభాకు అదనంగా 50% కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైదరాబాద్లో ఆక్సిజన్, రెమ్డెసివిర్ వంటి మందుల లభ్యతతోపాటు వాక్సిన్లపైనా ప్రభావం పడుతున్నదని ప్రధానికి సీఎం తెలిపారు.
ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతున్నదని, ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని దానిని 500 మెట్రిక్ టన్నులకు పెంచాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు. తెలంగాణకు రోజుకు 4,900 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు మాత్రమే అందుతున్నాయని, వాటిని రోజుకు కనీసం 25,000కు పెంచాలని కోరారు. ఇప్పటివరకు కేంద్రం 50 లక్షల డోసుల వ్యాక్సిన్ను అందజేసిందని, కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా మరిన్ని కావాల్సి ఉన్నదని తెలిపారు. రాష్ట్రానికి ప్రతిరోజు 2 నుంచి 2.5 లక్షల వ్యాక్సిన్ డోసుల అవసరం పడుతున్నదని, వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ప్రధాని సూచనతో సీఎంకు పీయూష్ గోయల్ ఫోన్
కేసీఆర్ విజ్ఞప్తి మేరకు, ప్రధాని ఆదేశాలతో కేంద్ర మంత్రి పీయూష్గోయల్ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రధానికి కేసీఆర్ విన్నవించిన అంశాలన్నింటినీ సత్వరమే సమాకూరుస్తామని, ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమ్డెసివిర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆక్సిజన్ను కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా, తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.