మేడ్చల్, జనవరి 29: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు నీటి అలుగు సమస్య శాశ్వత పరిష్కారానికి నోచుకోనున్నది. అలుగు నీటిని నేరుగా గుండ్ల చెరువుకు మళ్లించేందుకు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 130లో 11 ఎకరాల 4 గుంటల్లో నారాయణ చెరువు విస్తరించి ఉంది. గతంలో చెరువు చుట్టు పక్కల ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉండటంతో చెరువు నిండినప్పుడు నీరు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ కాలక్రమేణా నగర సరిహద్దుల్లో ఉన్న గుండ్లపోచంపల్లి విస్తరించింది. భారీగా చుట్టు పక్కలా నిర్మాణాలు వెలిశాయి. దీంతో నీరు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నాలుగైదేండ్లుగా…
నారాయణ చెరువు చుట్టు పక్కలా పెద్ద ఎత్తున నిర్మాణాలు వెలువడం, చెరువు పై భాగంగా ఉన్న అర్కెల్గూడ, ప్రెస్టేజ్ పార్కు ప్రాంతంలో లేఔట్లు కావడంతో డ్రైనేజీ, వరద నీరు నారాయణ చెరువులో కలిసేలా పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు పై నుంచి వచ్చే నీటితో నాలుగైదేండ్ల నుంచి నారాయణ చెరువు నిండుతున్నది. చెరువు నిండితే నీరు బయటికి వెళ్లేందుకు అవకాశం లేక మాణిక్యరెడ్డి నగర్, లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న గృహాల్లోకి వరద నీరు చేరుతుంది. ఒక్కసారి కాలనీలోకి నీరు చేరాయంటే 10 నుంచి 15 రోజుల వరకు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే నీరు తారు రోడ్డుపై నుంచి వెళ్తున్నాయి. దీంతో ఆ రోడ్డుపై నుంచి ప్రయాణించే మున్సిపాలిటీతో పాటు ఈ రోడ్డు మీదుగా ప్రయాణించే వివిధ ప్రాంతాల వారికి ఇబ్బందులు తతెత్తుతున్నాయి. ఆ సమయంలో మున్సిపాలిటీ అధికారులు తాత్కాలికంగా జేసీబీతో కాల్వను తవ్వి ఖాళీ ప్లాట్ల నుంచి తరలించాల్సి వస్తుంది.
రూ.కోటితో నాలా నిర్మాణం
నారాయణ చెరువు నీటితో ఇబ్బంది పడుతున్న లక్ష్మీనగర్, మాణిక్యరెడ్డి నగర్ కాలనీవాసులు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యను చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డితో పాటు అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కారించాలని కోరారు. పట్టణ ప్రగతిలో పర్యటించిన సందర్భంగా తమ సమస్యను వివరించారు. దీంతో స్పందించిన వారు సమస్య పరిష్కారానికి మున్సిపాలిటీ నుంచి రూ.కోటి ఖర్చుతో నాలా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇటీవల నాలా నిర్మాణ పనులను ప్రారంభించారు. నారాయణ చెరువు అలుగు నీరు వెళ్లేందుకు నాలా నిర్మిస్తున్న నేపథ్యంలో శనివారం గుండ్లపోచంపల్లిలో నీటిపారుదల శాఖ అధికారులు పర్యటించారు. మేడ్చల్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీరు హైదర్ఖాన్, ఈఈ బన్సీలాల్, డీఈఈ సురేశ్, ఏఈ గంగరాజు నీళ్లను నేరుగా గుండ్ల చెరువు తీసుకెళ్లేందుకు నిర్మించనున్న కాల్వ గురించి, మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గంతో చర్చించారు. నారాయణ చెరువు ట్యాంక్బండ్ చివర నుంచి నీటిని గుండ్లచెరువులో కలిపే కాల్వ నిర్మాణ పనులను నిర్మించనున్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నాం. నారాయణ చెరువు అలుగు సమస్యకు శాశ్వత పరిష్కారించాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీ నుం చి రూ.కోటి నిధులను కేటాయించాం. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కాల్వ నిర్మాణ ప్రణాళికపై చర్చిం చాం. నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, చైర్పర్సన్, గుండ్లపోచంపల్లి
స్థానికుల ఇబ్బందులు తొలగనున్నాయి..
నారాయణ చెరువు అలుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. చాలా కాలంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. మాణిక్యరెడ్డినగర్, లక్ష్మీనగర్ కాలనీవాసులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇందులో భాగంగా నారాయణ చెరువు పై నుంచి వస్తున్న వరద, యూజీడీ నీరు కూడా కల్వకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-రాములు, కమిషనర్, గుండ్లపోచంపల్లి