అమీర్పేట్ : ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవలే నిర్మాణాలు పూర్తి చేసుకున్న సనత్నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కమ్యూనిటీ హాలు మొదటి అంతస్తు ను, సీసీ టీవీ కెమెరాల వ్యవస్థలను డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి, ఆదిత్యనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు వై.ప్రభాకర్రెడ్డిలతో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని వ్యక్తిగత నిధులతో సమకూర్చిన క్యాటరింగ్ వస్తు సామగ్రిని కమ్యూనిటీ హాలు నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న కాలనీ అధ్యక్షులు వై.ప్రభాకర్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే సనత్నగర్ డివిజన్ ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిందన్నారు.
ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇక్కడి కాలనీకి చక్కటి వీడీసీసీ రోడ్లను నిర్మించి ఇచ్చామని, అయ్యంగార్ బేకరి చౌరస్తాలో వర్షం పడితే ముంపు సమస్య తలెత్తేదని, దశాబ్దాల కాలంగా కొనసాగుతూ వచ్చిన ఇటువంటి అనేక సమస్యలను పరిష్కరించేందుకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చినట్టు తెలిపారు.
చక్కటి కమ్యూనిటీ హాలు, ఫంక్షన్లు చేసుకునేందుకు అనుకూలమైన క్యాటరింగ్ సామగ్రితో పాటు సీసీ కెమెరాల వ్యవస్థకు తీర్చిదిద్దిన మంత్రి తలసానికి కాలనీ నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షాబాద్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.