హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సమష్టిగా రాణించింది. ఓటర్గా నమోదు చేయించడం నుంచి ఓటర్లను పోలింగ్ బూత్ వరకు వచ్చేలా గ్రేటర్ ప్రజాప్రతినిధులు, ఇన్చార్జిలు, శ్రేణులు, పార్టీ అభిమానులు విశేషంగా కృషి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వరకు మండలి ఎన్నికపై ఆచితూచి వ్యవహరించిన టీఆర్ఎస్.. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు ఎస్.వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి. అసత్య ప్రచారాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే దుశ్చర్యలు.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను టీఆర్ఎస్ ధీటుగా ఎదుర్కొన్నది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మొదట్నుంచి పక్కాగా పావులు కదిపారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ను కలిశారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతోపాటు జిల్లాలకు మంత్రులుగా గంగుల కమలాకర్, మంత్రి హరీశ్రావులు నిత్యం ప్రచార సరళిని తెలుసుకుంటూ ఇందుకు అనుగుణంగా ఓటర్లకు చేరువయ్యారు. పార్టీ ఏకంగా రెండు లక్షల 80వేలకు పైగా ఎన్రోల్ చేయగా, వారిని పోలింగ్ కేంద్రానికి తరలించడంలో సక్సెస్ అయ్యారు. ఓటింగ్ శాతం పెంచడంలో కీలకంగా వ్యవహరించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఈ తరహా ప్రయోగం చేయడం ఇదే తొలిసారిగా అని చెప్పవచ్చు.
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా క్యాంపెయిన్లో సత్తా చాటింది. పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. వివిధ సంఘాలు, ఉద్యోగులు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ప్రతి 50 ఓటర్లకు ఇన్చార్జిలతోపాటు నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లాల ప్రజాప్రతినిధులతో నిత్యం ప్రచార సరళి అనుగుణంగా వ్యూహాత్మకంగా ఇన్చార్జి మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్రావు పావులు కదిపారు. నిత్యం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ల ద్వారా శ్రేణులను దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటర్ గడపను తట్టి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ వారిని పార్టీ వైపు ఆకర్షించారు. అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే విద్యావేత్త, పీవీ కూతురు ఎస్ వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలంటూ వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే పట్టభద్రులు టీఆర్ఎస్ పక్షానే నిలబడ్డారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. విద్యావేత్త, లెక్చరర్, కరస్పాండెంట్గా వాణీదేవి లక్షలమంది గ్రాడ్యుయేట్లను తెలంగాణ సమాజానికి అందించడం, ఆమెకు పూర్వ విద్యార్థుల మద్దతు ఉండడం, ఇలా పార్టీకి కలిసి వచ్చాయని చెబుతున్నారు. ఎంతో మందికి విద్యనందించిన గొప్ప వ్యక్తి వాణీదేవి మండలిలో అడుగు పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ సరళి సంతృప్తిని కలిగించింది. మంత్రి కేటీఆర్ కృషి వల్లే భారీ పోలింగ్ శాతం నమోదైంది. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడానికి, ఓటింగ్ శాతం పెంచడంలో నాయకులు, ఇన్చార్జిలు విశేషంగా కృషి చేశారు. వారికి అభినందనలు, ఈ ఎన్నికల్లో కేసీఆర్ అభివృద్ధి ఎజెండానే పని చేసింది. కేసీఆర్ ఫొటోనే టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు సాధించగలదన్న ధీమా మాలో ఉంది. – గంగుల కమలాకర్, మంత్రి
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎస్.వాణీదేవి గెలుపు తథ్యం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు, సమావేశాలు నిర్వహించి మంత్రి కేటీఆర్ మమ్మల్ని ప్రోత్సహించారు. ప్రచారంలో పట్టభద్రుల ఓటర్లను కలుసుకొని విస్తృత ప్రచారం నిర్వహించాం. అందరూ సమష్టిగా రాణించారు. ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లకు అభినందనలు. – తలసాని శ్రీనివాస్యాదవ్, మంత్రి
మొట్టమొదటిసారిగా పట్టభద్రుల ఎన్నికలలో పోలింగ్ ఇంత భారీగా జరుగడం ఓటర్లతో వచ్చిన చైతన్యానికి ఇదే సాక్ష్యం. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం పట్ట ప్రజలకు పెరిగిన నమ్మకానికి ఈ పోలింగ్ నిదర్శనం. పట్టభద్రుల పోలింగ్ పర్సంటెజ్ తక్కువగా నమోదైన గతంలో పోలిస్తే పెరిగిన భారీ పోలింగ్ శాతం టీఆర్ఎస్కు అనుకూలం. ఉద్యోగాలపై విపక్షాలు చేసిన ప్రచారం పట్టభద్రులు నమ్మలేదు.. వాణీదేవి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. – కుర్మయ్యగారి నవీన్కుమార్, ఎమ్మెల్సీ