చర్లపల్లి, జూలై 23 : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సీహెచ్ భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న డిఫెన్స్ సర్వీస్ ఆర్డినెన్స్లను రద్దు చేయడానికి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) పరిశ్రమ ముందు ఈసీఐఎల్ గుర్తింపు యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి ప్రసాద్, యూనియన్ నాయకులు ప్రవీణ్, అంజుమ్, జోషికుమార్, కృష్ణ, బాలకృష్ణ, మహిపాల్, అంజనీకుమార్, షకీరుద్దీన్, రజాక్, పవన్, అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.