సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): పుట్టే ప్రతి శిశువు ఆరోగ్యంతోను లేదా అనారోగ్యంతోనూ పుట్టవచ్చు. శిశువు ఆరోగ్యంతో పుడితే ఫరవాలేదు. అనారోగ్యంతో పుడితేనే ఇబ్బంది. అందుకే పుట్టిన ప్రతి శిశువుకు వెంటనే అవయవాలు సరిగా ఉన్నాయా? లేదా? ఏమైనా సమస్యలున్నాయా అని పిల్లల వైద్య నిఫుణులు నిర్ధారణ చేస్తారు. అందులో ప్రధానమైనవి చెవి, కండ్లు, ముక్కు, గొంతు తదితరాలు. అందుకే ‘శిశువులకు వినికిడి పరీక్షలు తప్పనిసరైనాయి.
ఈ పరీక్షలను చేయకపోతే భవిష్యత్తుల్లో వినికిడి సమస్యలు తప్పవు’ అంటున్నారు వైద్య నిపుణులు. కొంత మంది శిశువులకు పుట్టుక నుంచే వినికిడి సమస్య ఉంటుంది. దీనిని శిశు ప్రాయంలోనే గుర్తిస్తే భవిష్యత్తుల్లో సమస్యను అధిగమించవచ్చంటున్నారు వైద్యులు. ప్రతి ప్రసూతి దవాఖానల్లో బిడ్డ జన్మించగానే శిశువులకు కంటి, చెవి తదితర ప్రధాన అవయవాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో ఒకటి డెఫీషియన్సీ (వినికిడి) పరీక్ష.
ప్రధానంగా హై రిస్క్ పిల్లలకు అంటే తక్కువ బరువు, నెలలు నిండకుండా జన్మించడం, ఎన్ఐసీయూలో చికిత్స పొందిన శిశువులు, ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న తల్లులకు సంబంధించిన శిశువులకు ఈ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామంటున్నారు నిలోఫర్ వైద్యులు. ఇందుకోసం నిలోఫర్ దవాఖానలోని నియోనాటల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆధునిక పరికరాలతో శిశువులకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. జన్మించిన ప్రతి శిశువుకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలతో పిల్లల్లో వినికిడికి సంబంధించిన ఏదైనా లోపం ఉంటే ప్రారంభంలోనే గుర్తించి చికిత్స చేసే వీలుంటుందన్నారు.
ప్రధానంగా హై రిస్క్ ఉన్న పిల్లలకు ‘ఓటో ఎరోస్టిక్ ఎమిషన్'(ఓఏఈ), బెరా’ పరీక్షలను నిర్వహిస్తారు. ఓఏఈ పరీక్షలో ఫెయిల్ అయిన శిశువులకు అంటే వినికిడి లోపం ఉన్న శిశువులకు తదుపరి ‘బెరా’ పరీక్షలను జరుపుతారు. దీని ఆధారంగా పిల్లల్లో వినికిడి లోపానికి సంబంధించిన కారణాలను గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తారు.
సాధారణంగా శిశువుకు ప్రతి ఆరు మాసాలకు ఒకసారి వినికిడి పరీక్షలు చేయించాలని నిలోఫర్ వైద్యులు డాక్టర్ రమేశ్ బాబు సూచిస్తున్నారు. దీని వల్ల పిల్లల్లో వినికిడి సమస్యతో పాటు కర్ణ భేరి తదితర సమస్యలు రాకుండా నివారించవచ్చన్నారు. పిల్లల్లో చెవి రంధ్రాల్లో డివైస్ (జీవిలి)పేరుకుపోతుంటుందని, అది గట్టిపడి వినికిడి సమస్యకు దారితీసే అవకాశముంటుందన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చన్నారు.