సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మరో ముందడుగు వేసింది. రహదారులను పరిశుభ్రంగా మార్చేందుకు ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నది. ఇందులో భాగంగా ఆరు జోన్ల పరిధిలో 18 కంపాక్ట్ హెవీ డ్యూటీ వ్యాక్యూమ్ స్వీపర్స్(రోడ్లను ఊడ్చే యంత్రాలు)ను అద్దెకు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. రోడ్లపై దుమ్ము లేవకుండా ఊడవటం, నగరంలో గాలి నాణ్యతను మరింత పెంచడం, మరీముఖ్యంగా కార్మికుల భద్రతకు పెద్దపీట వేయడం ఈ వాహనాల ప్రత్యేకత. 18 ప్యాకేజీలుగా విభజించిన అధికారులు ఏడాదికి ఒక్కో వాహనం నిర్వహణ వ్యయం రూ.1,14,46,400లుగా నిర్ణయించారు. ఈ యంత్రాల వినియోగం కోసం ఏడాదికి రూ.32 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఖైరతాబాద్ జోన్కి ఐదు, సికింద్రాబాద్కి నాలుగు, ఎల్బీనగర్కి నాలుగు, శేరిలింగంపల్లికి మూడు, కూకట్పల్లికి రెండు చొప్పున వాహనాలను అద్దె ప్రాతిపదికన కేటాయించనున్నారు. ప్రతిరోజు పది గంటల పాటు ఈ వాహనాలు ప్రధాన రోడ్లను శుభ్రపరచనున్నాయి. రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల పాటు జీపీఎస్ టెక్నాలజీ ద్వారా పనిచేయనున్నాయి.