శ్రీనగర్కాలనీ, ఆగస్టు 24 : పుట్టుకతోనే కొందరు వినికిడి సమస్యతో సతమతమవుతుంటారు. వారికి నయం చేయించాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడుతుంటారు. నిరుపేదలు, దిగువ మధ్యతరగతి వారు వేలకువేలు పోసే స్థోమత లేక దాతల కోసం అర్రులు చాస్తుంటారు. ఇలాంటి పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఖరీదైన వినికిడి పరికరాలు అందిస్తున్నది శ్రీనగర్ కాలనీలోని ఆశ్రయ్ ఆకృతి సంస్థ. సుమారు 25 ఏండ్లుగా చిన్నారులకు అండగా ఉంటున్నది. 1996లో ఏర్పాటైన ఈ సంస్థ దాతలు, ప్రభుత్వ తోడ్పాటుతో చెవి, వినికిడి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి, పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి వెంటనే పరికరాలు అందజేస్తున్నది. ఇప్పటివరకు దాదాపు 600 మందికి విద్యాభ్యాసం కల్పించింది. పదోతరగతి పూర్తి చేసిన వారిలో 80 మందికి ఉపాధి కల్పించింది. శ్రీనగర్కాలనీలోని ప్రధాన కార్యాలయంతోపాటు చాంద్రాయణగుట్ట, ఏపీలోని కడపలో ఉచిత చెవి, వినికిడి వైద్య శిబిరాలు.. ఎస్ఆర్నగర్, బోరబండ, యాకుత్పురాలో మానసిక వికలాంగులకు ఫిజియోథెరపీ నిర్వహిస్తున్నారు.
వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో ప్రవేశం కల్పిస్తారు. రేషన్కార్డుగల పేదలకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి , వారి పిల్లలకు ఉచితంగా చెవి, వినికిడి పరీక్షలు చేస్తున్నారు. పలు కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధులు, దాతల సౌజన్యంతో పేద విద్యార్థులకు అవసరమైన వసతి, విద్యనందిస్తున్నారు. టెన్త్ పూర్తి చేసిన వారికి సంబంధిత ప్రభుత్వ సంస్థల్లో పేర్లు నమోదు చేయించడంతోపాటు వారి ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం సంస్థ కృషి చేస్తున్నది. మరికొందరికి 3 నెలలపాటు స్వల్పకాలిక శిక్షణలో భాగంగా మల్టీమీడియా కోర్సు నేర్పిస్తున్నారు.
జంటనగరాల్లోని పేదలు అధికంగా ఉండే ప్రాంతాలతోపాటు మేడ్చల్, నల్గొండ జిల్లాల పరిధిలోని గ్రామాల్లో ఆశ్రయ్ ఆకృతి సంస్థ సంచార (మొబైల్ వెహికిల్స్) వాహనాల ద్వారా చెవి,వినికిడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వినికిడి లోపం కలిగిన వారిని గుర్తించి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు విలువైన పరికరాలను ఉచితంగా అందిస్తున్నారు. బోరబండ, ఎస్ఆర్నగర్, యాకుత్పురాలో సంస్థ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ, స్పీచ్థెరపీ, ప్రత్యేక ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
శ్రీనగర్కాలనీలోని ఆశ్రయ్-ఆకృతి సంస్థ కేంద్రంలో ఉచితంగా చెవి, వినికిడి పరీక్షలు నిర్వహిస్తున్నాం. సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రతిరోజు స్పీచ్థెరపీ, కోక్లియర్ ఇంప్లాంట్, ఆడిటరీ వెర్బల్ థెరపీ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వినికిడి పరికరాలు అందిస్తున్నాం. ఉచిత విద్యాభ్యాసం, వసతి కల్పిస్తున్నాం. -డీపీకే బాబు, సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్, ఎస్.మల్లికార్జున్, సమన్వయకర్త