సిటీబ్యూరో, జులై 4(నమస్తే తెలంగాణ) : లాక్డౌన్ సడలింపు అనంతరం రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. మద్యం మత్తులోనే అధికంగా జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీన్ని సీరియస్గా తీసుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం పలు కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దీంతో ఒకే రోజు ఏకంగా 126మంది పట్టుబడ్డారు. వీరి డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే గత ఆరు నెలల్లో దాదాపు 20 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు. వీరి లైసెన్స్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా కోర్టు విచారణ ఆగిపోయినందున తిరిగి ప్రారంభం కాగానే వీరందర్నీ కోర్టు ముందు హాజరుపరుస్తామని, ఆ లోపు ఎవరైనా వాహనాలను నడిపించి పోలీసులకు చిక్కితే రూ.10 వేలు జరిమానా, 3 నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరిస్తున్నారు.