సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): ఎవరైనా మద్యం సేవించి ఉండి తాము బండి నడుపుతామని మొండికేస్తే 100 కు కాల్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం సేవించి మందుబాబులు మత్తులో డ్రైవింగ్కు సిద్ధమైనప్పుడు వారిని సదరు నిర్వాహకులు వెంటనే గుర్తించాలి. వారికి ఇతర వాహనం ఏదైనా సమకూర్చే ప్రయత్నం చేయాలి. క్యాబ్ వంటిది బుక్ చేసి పంపాలి. లేదంటే పోలీసులను అప్రమత్తం చేయాలి. ఇలా చేయలేదంటే.. మద్యం సేవించి వాహనాలను నడిపించేందుకు ప్రోత్సహిస్తున్నారని స్పష్టమవుతుంది. అందుకని..నిర్వాహకులపై 188 సెక్షన్ కింద కేసును నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సెక్షన్ కింద ఆధారాలు రుజువైతే వారికి కూడా జైలు, జరిమానా, శిక్ష విధించే అవకాశం ఉందని, ఇంట్లో పార్టీ చేసుకునేవారు కూడా తమ ఇంటికి వచ్చే అతిథుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒక్కటే గుర్తుకు పెట్టుకోండి. తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో… కారైనా, బైకైనా అస్సలు నడపకండి. మద్యం తాగిన తర్వాత బండి నడిపితే కచ్చితంగా ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఎక్కువ. మెదడు మందగించి శరీరంపై అదుపు కోల్పోతుంది. ఆ సమయంలో చాలా మంది యువకులు వాహనాలను చాలా ర్యాష్గా నడుపుతారు. దీంతో ఏ చిన్న జంతువు అడ్డు వచ్చినా, వాహనం ఎదురు పడినా, డివైడర్ తగులుతుందని అపోహ పడినా వెంటనే స్టీరింగ్, హ్యాండిల్స్ తిప్పేస్తారు. దాంతో వాహనం అదుపుతప్పి బలంగా రోడ్డుకు గుద్దుకుంటుంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసే వాహనాలతో మరణాలు అధికంగా ఉంటున్నాయి. – విజయ్కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ