శంషాబాద్, మే 10 : మద్యం మత్తులో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలై మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకున్నది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన వెంగళ్రావు భార్య మమత సోమవారం ఇంద్రారెడ్డికాలనీ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్నది. అదే సమయంలో శంషాబాద్ మండలం చౌదరిగూడకు చెందిన ఎర్రోళ్ల మల్లేశ్(48) శంషాబాద్ నుంచి చౌదరిగూడకు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ.. మమతను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన సమయంలో ఎర్రోళ్ల మల్లేశ్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.