ర్యాలీలు, బాణాసంచాతో సందడి చేసిన కార్యకర్తలు
జై కేసీఆర్.. జై పువ్వాడ’ నినాదాలతో మార్మోగిన విధులు
గెలిపించిన ప్రజలకు చేతులు జోడించిన అభ్యర్థులు
ఐదేళ్లూ ప్రజాసేవకు అంకితంఅవుతామంటూ హామీలు
రఘునాథపాలెం, మే 3: ‘టీఆర్ఎస్’ కారు స్పీడుకి ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతైంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు తరువాత రెండోసారి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని సృష్టించింది. ఖమ్మం నగర ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఆధిక్యాన్ని అందించి ‘మేయర్’ పీఠాన్ని టీఆర్ఎస్ ఖాతాలో చేశారు. సోమవారం వెల్లడైన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు టీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ని నింపాయి. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో వాడవాడలా సంబురాలు అంబరాన్నంటాయి. గెలుపొందిన అభ్యర్థులతో టీఆర్ఎస్ కార్యకర్తలు డివిజన్లలో ర్యాలీలు నిర్వహించారు. కొవిడ్ కారణంగా పోలీసు శాఖ నిబంధనలు విధించడంతో అక్కడక్కడా పురవీధుల్లో బాణాసంచా పేల్చారు. ర్యాలీలను నిషేధించడంతో కార్యకర్తలు దూరందూరంగా ఉంటూ కాలనీల్లో తిరిగారు. ఈ సందర్భంగా ‘జై కేసీఆర్.. జై పువ్వాడ..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులు ర్యాలీలో భాగంగా అఖండ విజయాన్ని అందించిన డివిజన్ ప్రజలకు చేతులెత్తి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఐదేళ్ల పాటు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 1వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి తేజావత్ హుస్సేన్ 1362 ఓట్ల మెజారిటీతో, 2వ డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మలీదు వెంకటేశ్వర్లు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి నర్రా ఎల్లయ్యపై 1256 ఓట్లతో, 3వ డివిజన్ కార్పొరేటర్గా స్వతంత్ర అభ్యర్థి మలీదు జగన్మోహన్రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కొణకంచి వరప్రసాద్పై 720 ఓట్ల మెజారిటీతో, 5వ డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్కు చెందిన పల్లెబోయిన భారతి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి తొట్టి ఉమారాణిపై 422 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 6వ డివిజన్ కార్పొరేటర్గా నాగండ్ల కోటేశ్వరరావు (టీఆర్ఎస్) గెలుపాందారు. 7వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి దొంగల సత్యనారాయణ టీఆర్ఎస్ అభ్యర్థి లింగనబోయిన లక్ష్మణ్పై 289 ఓట్ల మెజారిటీతో, 8వ డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్కు చెందిన లకావత్ సైదులు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గుగులోతు మోహన్పై 67 ఓట్ల తేడాతో గెలుపొందారు.