హైదరాబాద్ : వరకట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ(29) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. హయత్నగర్కు చెందిన గణేశ్తో స్వాతి అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. కట్నకానుకల కింద రూ. 10 లక్షలు, 5 తులాల బంగారం, ఇతర వస్తువులను ఇచ్చారు.
అయితే అదనపు కట్నం కావాలని గత కొన్ని నెలల నుంచి స్వాతిని భర్తతో పాటు అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారు. మరో రూ. 10 లక్షలు తీసుకురావాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో స్వాతి తల్లిదండ్రులు రూ. 5 లక్షలు ఇచ్చారు. మిగతా రూ. 5 లక్షలు కూడా తీసుకురావాలని వేధించారు. అత్తమామలు, భర్త వేధింపులు తాళలేక స్వాతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.