భర్త, అత్తకు ఏడాది పాటు
జైలు శిక్ష.. పది వేలు జరిమానా
అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసిన తల్లీకొడుకులకు ఏడాది పాటు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ.. మేడ్చల్ కోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్ వెన్నెలగడ్డ ప్రాంతానికి చెందిన పోచమ్మల ప్రశాంత్, రేవతిలకు 2013లో వివాహం జరిగింది. వివాహం సమయంలో రూ.6.20లక్షల నగదుతో పాటు 18 తులాల బంగారం, గృహఅవసర వస్తువులను కట్నకానుకల కింద ఇచ్చి పెద్దల సమక్షంలో పెండ్లి చేశారు. పెండ్లయిన మూడు నెలల తర్వాత అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. తన భర్తతో పాటు అత్తామామలు, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధించసాగారు. ఇదే సమయంలో పాప పుట్టింది. అయినప్పటికీ వేధిస్తుండటంతో రేవతి తల్లిదండ్రులు రెండు తులాల బంగా రం, వెండి ఆభరణాలు పెట్టారు. వీటితో సరిపెట్టుకోని భర్త, అత్తామామలు మరో 150 గజాల ప్లాట్తో పాటు ఇతర వస్తువులు పెట్టాలని రేవతిని మానసికంగా, శారీరకంగా వేధించారు. పెద్ద మనుషులు చెప్పినా తీరు మార్చుకోలేదు. దీంతో చేసేది లేక రేవతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన మేడ్చల్ కోర్టు నేరం రుజువు కావడంతో భర్త ప్రశాంత్, అత్త జయలక్ష్మికి ఏడాది పాటు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.