ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డబుల్ బెడ్ రూం’ పథకంతో పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తున్నది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంకాల్లో రూ. 150 కోట్లతో 19 బ్లాకుల్లో 2016 ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సర్దార్నగర్లో రూ. 53.14 కోట్లతో 26 బ్లాకుల్లో 832 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే లబ్ధిదారులకు అందించేందుకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది.
అర్హులైన పేదలకు సొంతింటిని నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డబుల్ బెడ్ రూం’ పథకం పేదల కలను సాకారం చేయనున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంకాల్, సర్దార్నగర్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మంకాల్లో 12 ఎకరాల్లో రూ. 150 కోట్లతో 19 బ్లాకుల్లో 2016 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సర్దార్నగర్లో 9.5 ఎకరాల్లో రూ. 53.14 కోట్లతో 26 బ్లాకుల్లో 832 ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
అపార్ట్మెంట్ తరహాలో..
తుక్కుగూడ మంకాల్లో 9 అంతస్తుల ఎత్తులో 19 బ్లాకులుగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టారు. 108 ఇండ్ల చొప్పున 14 బ్లాకులను, 216 ఇండ్ల చొప్పున ఒక బ్లాకు, 72 ఇండ్ల చొప్పున 4 బ్లాకులను నిర్మించారు. ప్రతి బ్లాకులో రెండు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. దీంతో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని తలపిస్తున్నది. సర్ధార్నగర్లో జీ+3 తరహాలో మొత్తం 26 బ్లాకుల్లో 832 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు.
నిబంధనలకు లోబడి..
హెచ్ఎండీఏ నిబంధనలకు లోబడి ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టింది. ప్రతి బ్లాకులో కనీస వసతులతోపాటు సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లను పార్కింగ్ కోసం కేటాయించారు. ఎటువంటి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా వెంటనే అదుపులోకి వచ్చేలా ఫైర్ సేఫ్టీ నిబంధనలకు లోబడి ఇండ్లను నిర్మించారు. ప్రతి బ్లాకులోని 9 అంతస్తులతోపాటు సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో ఫైర్ సేఫ్టీ పరికరాలను అమర్చారు. అగ్నిమాపక వాహనాలు భవనం చుట్టూ తిరిగేందుకు వీలుగా సెట్ బ్యాక్ నిర్మాణం చేపట్టారు.
అర్హులందరికీ అందజేస్తాం
ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుని డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో చాలాచోట్ల ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఒకటి, రెండుచోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. అర్హులందరికీ న్యాయం చేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తాం. – సబితా ఇంద్రారెడ్డి, మంత్రి