సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు గ్రేటర్ పరిధిలోని 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను జీహెచ్ఎంసీ విడుతల వారీగా లబ్ధిదారులకు అందిస్తున్నది. ఈ నెల 26న అంబేద్కర్ నగర్లో పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 330 మంది లబ్ధిదారులకు డబుల్ గృహాలను అందజేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట డివిజన్ పొట్టి శ్రీరాములు నగర్లో నిర్మించిన 162 డబుల్ బెడ్ రూం ఇండ్లను సోమవారం లబ్ధిదారులకు అందించనున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాద వ్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హోం మంత్రి మహమూద్ ఆలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ వాణీదేవిలు పాల్గొననున్నారు. 560 చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక లివింగ్ రూం, రెండు బెడ్రూంలు, ఒక కిచెన్, రెండు టాయిలెట్లు ఉన్నాయి. రూ.8.65 లక్షల వ్యయంతో నిర్మించిన ఒక్కో డబుల్ బెడ్ రూం గృహాన్ని లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించనున్నారు. అంతేకాక తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లిఫ్ట్, ఫైర్ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాలను ఏర్పాటు చేశారు. గతంలో పూర్తిగా మురికివాడలుగా ఉన్న గాంధీనగర్, సాయిరాం నగర్లలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.