హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని అధిగమించింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పాలు రవాణాచేసినట్టు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020- 21 మార్చి 16 వరకు దూద్ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా దేశ రాజధాని ఢిల్లీకి మునుపెన్నడూ లేనివిధంగా 7 కోట్ల లీటర్ల పాలను రవాణాచేశామని తెలిపారు. జోన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రేణిగుంట నుంచి 2011- 2012లో పాల రవాణా ప్రారంభమైంది. ప్రారంభంలో పాల ట్యాంకర్లను రెగ్యులర్ సూపర్ ఫాస్ట్ రైలుకు అనుసంధానం చేసేవారు. డిమాండ్ దృష్ట్యా 2019- 20లో 4.4 కోట్ల లీటర్ల పాలు రవాణాచేశారు.
2020లో కరోనా లాక్డౌన్ కారణంగా ప్రయాణికుల రైళ్లను నిలిపివేయడంతో పాల రవాణా సవాల్గా మారింది. ఈ పరిస్థితుల్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పాల రవాణాకు ‘దూద్ దురంతో’ పేరుతో ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు. 26 మార్చి 2020 నుంచి ప్రారంభమైన దూద్ దురంతో ప్రత్యేక రైళ్లను 15 జూలై 2020 నుంచి ప్రతిరోజూ నడుపుతున్నారు. వీటికి మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లతో సమాన ప్రాధాన్యం ఇస్తూ రేణిగుంట- హజరత్ నిజాముద్దీన్ మధ్య (2,300 కిలోమీటర్ల దూరం) కేవలం 30 గంటల్లో చేరేలా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 296 ట్రిప్పులతో 1,753 పాల ట్యాంకర్లతో 7 కోట్ల లీటర్ల పాలను రవాణా చేశారు. పాల సేకరణ, రవాణాకు కృషిచేసిన గుంతకల్ డివిజన్, జోనల్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, అధికారులను జీఎం గజానన్ మాల్యా ప్రత్యేకంగా అభినందించారు.