సంగారెడ్డి యువకుడి మరో రికార్డు
20 రోజుల్లో పది రాష్ర్టాలు, రెండు ఇండియా బార్డర్లు
శశికల్యాణ్కు సర్వత్రా అభినందనల వెల్లువ
కంది, ఏప్రిల్ 23 : బైక్పై షికారు.. కొట్టాలంటే చాలా మందికి ఎంతో సరదాగా అనిపిస్తుంది. బైక్పై బయటకి షికారుకు వెళ్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనంత హాయిగా ఉంటుంది. ఇంతకు ముందు తన బైక్పై ఇండియా టూర్ చుట్టేసొచ్చిన శశికల్యాణ్, ఈ సారి ఏకంగా స్కూటీపై 6వేల కిలో మీటర్ల దూరాన్ని కేవలం 20 రోజుల్లో పూర్తి చేసి వచ్చాడు. జర్నీ మొదలైన నాటి నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకు అతడి స్కూటీ యాత్రకు ఎక్కడా కూడా బ్రేక్ వేయలేదు. సంగారెడ్డికి చెందిన శశికల్యాణ్ స్థానికంగా ఫొటోగ్రాఫీ ఫీల్డ్లో పని చేస్తున్నాడు. అతడి తండ్రి ఆర్టీసీ డ్రైవర్గా చేస్తున్నాడు. గతంలో కూడా ఇతడి సాహస యాత్రపై ‘నమస్తేతెలంగాణ’లోని సండే మ్యాగ్జైన్లో ప్రచురితమైంది.
స్కూటీపై 20 రోజుల్లో 6వేల కిలోమీటర్లు..
శశికల్యాణ్కు డ్యూక్ 360 మోడల్ బైక్ ఉంది. ఎక్కువగా ఆ బండిపైనే మోటో వ్లాగింగ్ చేస్తుంటాడు. ఈ సారి ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుని అతడి వద్ద ఉన్న హోండా గ్య్రాజియా బండిపై ఏకంగా 6వేల కిలో మీటర్ల దూరాన్ని ఎంచుకున్నాడు. ఈ రైడ్ను కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేసి వచ్చాడు. ఈ నెల 1న సంగారెడ్డిలో మొదలైన అతడి స్కూటీ యాత్ర మొత్తం 10 రాష్ర్టాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, బీహార్, సిక్కిమ్, అస్సాం, మేఘాలయ, వెస్ట్బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్తో పాటు రెండు ఇండియా బార్డర్లు చైనా, నేపాల్ వరకు వెళ్లి ఈ నెల 20న తిరిగి సొంత ఊరు సంగారెడ్డికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. స్కూటీపై వెళ్లేటప్పుడు అక్కడక్కడా బండి పాడవడం, ఇతర ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, అనుకన్నది సాధించి క్షేమంగా ఇంటికి చేరుకున్నానని శశికల్యాణ్ తెలిపారు. ఈ యాత్రకు దాదాపు రూ.40 నుంచి 50వేల వరకు ఖర్చు వచ్చిందన్నారు. రైడ్ మొత్తం ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపారు. తాను ఏ రైడ్ చేసినా తన యూటూబ్ ఛానల్ skvlogsలో అప్లోడ్ చేస్తానని, తన ఛానల్ను అందరూ వీక్షించి ఆదరించాలని శశికల్యాణ్ కోరారు.