వనస్థలిపురం, ఆగస్టు 19 : బాల్య వివాహాలు నేరమని, వాటిని నిర్మూలనకు అందరూ సహకరించాలని జిల్లా చైల్డ్ లైన్ కౌన్సిలర్ ముదిగొండ రూప అన్నారు. గురువారం సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటి జంగయ్యనగర్ కాలనీలో జరిగిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. శారీరకంగా, మానసికంగా ఎదగకుండా వివాహాలు చేస్తే జీవితమంతా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
చిన్న వయసులో పెండ్లి చేయడం చట్టరీత్యా నేరమనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఎల్బీనగర్ షీ టీమ్స్ ఇన్చార్జి రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. బాలికల రక్షణకు తాము నిరంతరం పని చేస్తున్నామన్నారు. ఈవ్ టీజింగ్, సైబర్ వేధింపులపై తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జ్యోతి, పర్వీన్, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.