హుజూర్నగర్, ఏప్రిల్ 5 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును గ్రేడింగ్ చేసి మండలాల వారీగా ప్రభుత్వ విద్య స్థితికి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ)ఇవ్వనున్నది. 2019-20 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన పథకాలు, వాటి అమలు తీరు, స్థితిని ప్రత్యేక ఫార్మాట్లో నమోదు చేసి ఆన్లైన్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖకు పంపనున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో 13అంశాలు, డొమైన్స్, సబ్ డొమైన్స్, ఇండికేటర్, స్కోర్ రూపంలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. పీజీఐ ఫలితాల మేరకు భవిష్యత్లో జిల్లాల వారీగా బడ్జెట్ను మంజూరు చేయనున్నట్లు తెలిసింది. జిల్లాలో 702పీఎస్, 81యూపీఎస్, 211హెచ్ఎస్, 31 హెచ్ఎస్ఎస్లు ఉన్నాయి. పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల వేతనాలు, పథకాల అమలుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లలో నిధులు మంజూరు చేస్తున్నది. పథకాలు రూపొందించినా అమలులో వైఫల్యం ఉందని ప్రభుత్వం గుర్తించింది. గ్రేడింగ్ ద్వారా పాఠశాలల నిర్వహణ మెరుగుపర్చడంతోపాటు విద్యార్థులకు గుణాత్మక విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నది.
ఈ అంశాలే ముఖ్యం..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు పరుస్తున్నది. పాఠశాలల ఉన్నతీకరణ, కొత్త పాఠశాలల ప్రారంభం, పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, భవనాల నిర్మాణాలు, యూనిఫాం, పాఠ్య, నోటు పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, బాలికల విద్య కోసం కేజీబీవీల నిర్వహణ, విద్యాపరంగా ప్రజలను చైతన్యపర్చడం, ఉపాధ్యాయుల విద్యాబోధన, నిర్వహణపై శిక్షణ, ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకులాల్లో బోధన, 8నుంచి 12వ తరగతి వరకు వృత్తి విద్యా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆయా పథకాల అమలుతీరును అంచనావేసి సమాచారాన్ని పీజీఐ ఫార్మాట్లో నమోదు చేయనున్నారు. సమాచారాన్ని విశ్లేషించి జిల్లాల వారీగా ఇచ్చిన గ్రేడింగ్ ప్రకారం భవిష్యత్ విద్యా సంవత్సరంలో నిర్వహణ లోటుపాట్లను సరిదిద్దనున్నారు. పాఠశాలల పనితీరు, మదింపు విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రతిభ చూపిన పాఠశాలలకు అదనంగా నిధులు కేటాయించే ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించనున్నది.
ఇవీ కూడా చదవండి…
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..అధికారుల అలసత్వం
జాగ ఉన్న పేదలందరికీ డబుల్ ఇండ్లు