హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 3 కిలోల కణితిని రెనోవో ఆస్పత్రి డాక్టర్లు తొలగించారు. సదరు మహిళకు కొద్ది కాలం నుంచి కడుపులో తీవ్రమైన నొప్పి రావడం, వెన్నునొప్పి అధికమవడంతో.. రెనోవో ఆస్పత్రిలోని గైనకాలజిస్టు డాక్టర్ రాజా శ్రీని సంప్రదించింది. దీంతో డాక్టర్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భాశయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో బాధిత మహిళకు డాక్టర్ రాజా శ్రీ, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కలిసి సర్జరీ నిర్వహించి గర్భాశయంలో ఉన్న కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 3 కిలోలు ఉందని వైద్యులు తెలిపారు. కణితిని పరీక్షల నిమిత్తం హిస్టోపాథాలాజికల్ ఎగ్జామినేషన్కు పంపించారు.
అయితే బాధిత మహిళ 15 ఏండ్ల క్రితం సర్వైకల్ క్యాన్సర్ బారిన పడిందని, దానికి శస్ర్త చికిత్స కూడా నిర్వహించినట్లు తెలిసింది. గర్భాశయాల్లో కణితులు అరుదుగా ఏర్పడుతాయని వైద్యులు పేర్కొన్నారు. సరైన సమయంలో సర్జరీ నిర్వహించకపోతే ప్రమాదం కలిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మహిళ కోలుకుంటుందని డాక్టర్ రాజా శ్రీ వెల్లడించారు.