నల్లగొండ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టారని నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్లగొండ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా వడ్ల కొనుగోలు తదితర అంశాలలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది.
పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను కష్టాల్లోకి నెట్టిందని మండిపడ్డారు. మాటలతో కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని, ప్రజలు ముఖ్యంగా మహిళలంతా అప్రమత్తులై మళ్లీ కేసీఆర్కే పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.