యువత ప్రస్తుతం కేవలం ఇంటర్ వరకే రెగ్యులర్ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నది. పీహెచ్డీ, ఎంఫిల్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు మినహా మిగతా అన్ని కోర్సులను దూరవిద్యా విధానంలోనే అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నది. కేంద్ర నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. పీజీ కోర్సుల్లో రెగ్యులర్గా అభ్యసించేవారు 9,75,105 మంది ఉండగా, డిస్టెన్స్ విధానంలో 11,21,446 మంది, యూజీ కోర్సుల్లో రెగ్యులర్ విద్యార్థులు 23,04,499 మంది ఉండగా, డిస్టెన్స్ విధానంలో 29,17,847 మంది, పీజీ డిప్లొమా కోర్సుల్లో 48,719 మంది రెగ్యులర్, 88,966 మంది డిస్టెన్స్, డిప్లొమా కోర్సుల్లో 1,56,098 మంది రెగ్యులర్, 1,20,060 మంది డిస్టెన్స్, సర్టిఫికెట్ కోర్సుల్లో 26,103 మంది రెగ్యులర్, 34,746 మంది డిస్టెన్స్లో ప్రవేశాలు పొందడం గమనార్హం. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నవారిలో 52.7 శాతం మంది దూరవిద్యా విధానంలో అభ్యసిస్తుండడం విశేషం. ఇందులో 68.06 శాతం మంది యూజీ కోర్సుల్లో, 26.16 శాతం మంది పీజీ కోర్సుల్లో, 2.80 శాతం మంది డిప్లొమా కోర్సుల్లో, 2.98 శాతం మంది వివిధ సర్టిఫికెట్ కోర్సుల్లో చేరుతున్నారు.
ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. 18 నుంచి 23ఏళ్ల మధ్య వయస్సు గలవారు మొత్తంగా విద్యాప్రవేశాలు పొందుతున్న వారిలో 26.9 మంది పురుషులు ఉండగా, స్త్రీలు జాతీయ సగటుకు మించి 27.3 శాతం మంది ఉన్నారు. జాతీయ గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి 27.1శాతంగా నమోదయ్యింది. అందులో యూజీ కోర్సుల్లో 50.8శాతం మంది పురుషులు, 49.2శాతం మంది మహిళలు చేరుతున్నారు. డిప్లొమా కోర్సుల్లో 65.1 శాతం మంది పురుషులు, 34.9శాతం మంది మహిళలు, పీహెచ్డీ కోర్సుల్లో 55 శాతం మంది పురుషులు, 45 శాతం మహిళలు, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 56.2 శాతం మంది పురుషులు, 43.8శాతం మంది మహిళలు, పీజీ డిప్లొమా కోర్సుల్లో 53.6 శాతం మంది పురుషులు, 46.4 శాతం మంది మహిళలు ప్రవేశాలు పొందుతుండడం విశేషం.
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : దూర విద్య..గతంలో చాలామంది చదువుకునేందుకు వసతి లేనివారు, పట్టణాలకు దూరంగా ఉన్నవారు దూర విద్య(డిస్టెన్స్ ఎడ్యుకేషన్) ద్వారా పలు కోర్సుల్లో చేరి ఉత్తీర్ణులయ్యేవారు. క్రమంగా పట్టణాలు, నగరాల్లోనూ ఉంటూ దూర విద్యను మరింత దగ్గరకు చేర్చుతున్నారు. ప్రస్తుతం యువత ఇంటర్ వరకే రెగ్యులర్గా చదివేందుకు ఆసక్తి చూపుతున్నది. డిగ్రీ, ఆపై ఉన్నత చదువును దూరవిద్యా విధానం ద్వారా అభ్యసించేందుకు మొగ్గుచూపుతున్నది.
అదీగాక సంప్రదాయ కోర్సులకు భిన్నంగా డిప్లొమా, ఇతర వృత్తివిద్యా కోర్సుల వైపు కూడా దృష్టి సారిస్తున్నది. అంతేకాదు పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉన్నతవిద్యను అభ్యసించేందుకు జోరుగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2019-20 పేరిట కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తున్నది. దేశవ్యాప్తంగా 1019 యూనివర్సిటీలు, 39,955 కళాశాలలు, 9599 స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.
ఆ వివరాలన్ని క్రోడీకరించి ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) సహకారంతో నివేదికను రూపొందించింది. ఆ నివేదికలో అత్యధికంగా కాలేజీలను కలిగి ఉన్న జిల్లాలో హైదరాబాద్ దేశవ్యాప్తంగా మూడోస్థానంలో నిలవడం గర్వకారణం. 1009 కాలేజీలతో బెంగళూరు అర్బన్ మొదటి స్థానం, 606 కాలేజీలతో జైపూర్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోగా, 482 కాలేజీలతో హైదరాబాద్ తృతీయ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం విద్యాసంస్థల్లో కేవలం 10 జిల్లాల్లోనే 10.2శాతం విద్యాసంస్థలు ఉండడం గమనార్హం.