అంబర్పేట, ఆగస్టు 17 : కలర్ జిరాక్స్ తెచ్చుకుంటానని ఇంట్లోంచి వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థి అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్పై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…నల్లకుంటలో నివాసముండే ఉత్తమ్రూప, బి.ఆర్. నాగరాజు దంపతుల కూతురు బి.ఆర్.శ్రావణి(23) బీఎన్ రెడ్డి నగర్లో గల సాయి గాయత్రి కాలేజ్ అండ్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.
గత నెలలో పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో తన లగేజ్, బుక్స్ తీసుకొని నల్లకుంటలో గల ఉత్తమ్రూప ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటుంది. ఈ నెల 16వ తేదీ ఉదయం 10.30 సమయంలో ఉత్తమ్రూప సోదరుడు తరుణ్కుమార్ వద్ద కలర్ జిరాక్స్ తెచ్చుకుంటానని వంద రూపాయలు తీసుకొని వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. చాలా ఆలస్యమైనా ఇంటికి రాకపోవడంతో తరుణ్కుమార్ చుట్టుపక్కల ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోకి వెళ్లి శ్రావణి కోసం వెతికాడు.
ఎక్కడ ఆచూకీ లభించలేదు. వెంటనే తన సోదరి ఉత్తమ్రూపకు ఫోన్చేసి విషయాన్ని తెలిపాడు. ఆమె తన భర్తతో కలిసి శ్రావణి చదువుతున్న కాలేజీకి ఫోన్ చేయగా, అక్కడకు కూడా రాలేదని కాలేజీ యాజమాన్యం తెలిపింది. దీంతో శ్రావణి స్నేహితులు డాలి చిట్టి, శ్రీరామ్ నాయక్లపై అనుమానం వ్యక్తం చేస్తూ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.