సిటీబ్యూరో, సెప్టెంబరు 4(నమస్తే తెలంగాణ): మహిళల భద్రతకు భరోసా ఇవ్వడంలో ‘సైబరాబాద్ డయల్ 100’ టీమ్స్ ముందుంటున్నాయి. గృహ హింస, ఈవ్టీజింగ్, అసభ్య ప్రవర్తన, భర్త వేధింపులు ఇలా ఏ ఇబ్బంది వచ్చినా.. బాధితులు కాల్ చేస్తే చాలు.. నిమిషాల్లోనే పోలీసులు చేరుకుంటున్నారు. కష్టం తీర్చి.. అండగా నిలుస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు సుమారు 1460 ఫిర్యాదులు రాగా, వెంటనే పరిష్కారం చూపి..‘ఆమె’కు కొండంత ధైర్యమిచ్చారు.
ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించి.. పరిష్కారం చూపారు. తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుమారు 22 ఫిర్యాదులపై కేసులు నమోదు చేయగా, మద్యానికి బానిసలై భార్యలను వేధిస్తున్న 121 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే ‘సైబర్’ మోసాలకు గురైన వారికి సాయం చేశారు.
గృహహింస, ఈవ్టీజింగ్ ఇలా ఏ సమస్య ఉన్నా.. బాధితులు నేరుగా ‘డయల్ 100’ను సంప్రదించవచ్చు. బాధిత మహిళల కోసం ప్రత్యేకంగా సైబరాబాద్ పరిధిలో ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. 24/7 అందుబాటులో ఉంటాయి. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే సేవలు అందుతాయి. ఎవరూ భయపడొద్దు.. సమస్య పరిష్కారానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. – అనసూయ, సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ