కుత్బుల్లాపూర్, జూన్ 1: కొంపల్లి మున్సిపాలిటీ, దూలపల్లి లింగం చెరువులో సోమవారం స్నానాలకు వెళ్లిన ఇద్దరు బాలికలు మునిగిపోగా.. సాయంత్రం ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. పేట్ బషీరాబాద్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…దూలపల్లి లింగం చెరువు సమీపంలో గుడిసెలు వేసుకొని కొన్ని కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి. వీరంతా ఉదయమంతా చిత్తుకాగితాలు ఎరుకొని పూట గడుపుకుంటున్నారు. ఈ గుడిసెల సమీపంలో ఉన్న చెరువులోనే నిత్యం వారు స్నానాలు చేస్తుంటారు.. ఇందులో భాగంగా సోమవారం సంజన(13), కరీనా(12) ఆ చెరువులోకి స్నానానికి వెళ్లారు.. అలాగే చేపలు పట్టడానికి ఇంకా లోనికి వెళ్లి నీటిలో మునిగిపోయారు. అక్కడే పశువులు కాచుతున్న వృద్ధుడు గమనించి చుట్టుపక్కలవారికి తెలిపాడు. వెంటనే వారు వచ్చి చెరువులో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా సాయంత్రం సంజన మృతదేహం లభ్యం కాగా.. కరీనా మృతదేహం లభ్యం కాలేదు.. తిరిగి మంగళవారం ఉదయం గాలించగా కరీనా మృతదేహం దొరికింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.