హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లు, కరోనా వైరస్పై గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మినస్టర్ క్వార్టర్స్ నుంచి జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, వీఎం అబ్రహం, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, రవాణాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ వాహనాలను ధాన్యం రవాణాకు ఉపయోగించుకోవాలన్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసి, ఒక వేళ స్థల సమస్య ఉంటే పక్క మిల్లుకు లేదా సమీప గోదాములకు తరలించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంతో చేయూతనిచ్చి పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తుంటే చిన్న చిన్న తప్పిదాలతో రైతులకు నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అని చెప్పారు. క్రాప్ బుకింగ్లో నమోదు కాలేదన్న సాకుతో రైతుల ధాన్యం కొనుగోలును తిరస్కరించొద్దు అని పేర్కొన్నారు. క్రాప్ బుకింగ్ సమస్యలుంటే తరువాత శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల నుండి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం విజ్ఞప్తి వస్తుంది.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి చెప్పారు.
కరోనా మహమ్మారి నివారణకు వైద్యసిబ్బంది చేస్తున్న కృషి అమోఘం అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా లక్షణాలుంటే చికిత్స చేయించుకోవాలని సూచించారు. కరోనా నివారణకు అవసరమైన సదుపాయాల కల్పనకు, వచ్చే నెలలో అవసరమైన కిట్ల వివరాలు సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇంటింటి జ్వర సర్వేలు ఖచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కేసులు హైదరాబాద్ వరకు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే మెరుగైన చికిత్స అందేలా చూడాలన్నారు.